నాగార్జున సాగర్ జానాదేనా: సైకిల్, కారుకు చీలుతారా?
నల్గొండ: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ తరఫున మాజీ మంత్రి జానా రెడ్డి, టిడిపి - బిజెపి అభ్యర్థి అంజయ్య యాదవ్, తెరాస తరఫున సిపిఎం మాజీ నేత నోముల నర్సింహయ్యలు ప్రధానంగా బరిలో నిలిచారు. జానా రెడ్డికి రాజకీయ చరిత్ర, అంజయ్యకు సామాజిక సమీకరణం, నోములకు తెలంగాణవాదాలు బలం. సీనియర్ రాజకీయ నాయకుడు కుందూరు జానారెడ్డి ఐదుసార్లు గెలిచి.. ఆరోసారీ గెలుపు కోసం బరిలో దిగారు.
సాగర్లో గట్టి సామాజిక వర్గం అయిన యాదవుల బలంపై కన్నేసి కడారు అంజయ్య యాదవ్ కదులుతున్నారు. రెండేళ్లుగా సాగర్ను అంటి పెట్టుకున్నారు. నోములకు నల్లగొండ రాజకీయాలు కొట్టిన పిండి. రాజకీయ ఎత్తుగడల్లో జానారెడ్డి దిట్ట. 1983, 85లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలో చేరి 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు. అనేక మంత్రివర్గాల్లో మంచి శాఖలు నిర్వహించారు. ముఖ్యమంత్రి తర్వాత స్థాయి హోదాను ఆయన అందుకున్నారు.
1994 ఎన్నికల్లో జానా భంగపడ్డారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన గుండెబోయిన రాంమూర్తి ఆ ఎన్నికల్లో గెలిపారు. తొలుత కొంత తొట్రుపడినా క్రమంగా జానారెడ్డి తిరిగి దూసుకొచ్చారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో హాట్రిక్ విజయం సాధించారు. ప్రతి ఒక్కరినీ పేరుపెట్టి పిలిచే దగ్గరితనం, గ్రామ గ్రామాన బలమైన అనుచరగణమే ఆయన బలంగా చెబుతారు. ఎత్తులు, జిత్తులు, ఆర్థికంగా బలవంతుడు కావటం, తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి నాయకత్వం వహించటం ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు.
నియోజకవర్గంలో ఉన్న 30 వేల యాదవ వర్గం ఓట్లు ఈసారి బరిలో ఉన్న ఇదే సామాజిక వర్గం నేతలిద్దరి మధ్య చీలి అంతిమంగా గెలుపు వరిస్తుందని జానా వర్గం అంచనా వేస్తోంది. టిడిపికి ఉన్న బలమైన సాంప్రదాయక ఓటుకు తోడు.. తన సామాజికవర్గం బలం కలిస్తే సీటుకు ఢోకా ఉండన్న ధీమా అంజయ్య యాదవ్లో వ్యక్తం అవుతున్నది. రాజకీయాల్లో కింద నుంచి ఎదిగిన నేపథ్యం తనను అందరివాడిగా నిలుపుతుందని ఆయన నమ్ముతున్నారు.
గత రెండేళ్లుగా సాగర్ నియోజకవర్గంపైనే ఆశలు పెట్టుకొని పని చేస్తున్నారు. అయితే, స్థానికేతరుడు కావటం, గత పదేళ్లుగా నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న తేర చిన్నప రెడ్డితో విభేదాలు కడారు ప్రతికూలంగా మారవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నోముల నరసింహయ్య ఇటీవలె తెరాసలో చేరారు. 1999, 2004 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి సిపిఎం పక్షాన నరసింహయ్య శాసనసభాపక్ష నేతగా పని చేశారు.
యాదవ సామాజిక వర్గానికి ఉన్న ఓట్లు, తెలంగాణ సెంటిమెంటు, సీనియర్ నాయకుడు కావడం, ప్రజలకు సేవ చేశాడన్న పేరు కలిసి వస్తాయని నరసింహయ్య లెక్కలు వేసుకుంటున్నారు. నిర్మాణంలో తెరాస బలహీనంగా ఉండటం, సుమారు 15 వేల సెటిలర్ల ఓట్లు ఉండటం, స్థానికేతరుడు కావటం నరసింహయ్యకు ప్రతికూల అంశాలుగా మారనున్నాయంటున్నారు.