రాజమండ్రి: మురళీ మోహన్కు జగన్ పార్టీ గట్టి పోటీ
రాజమండ్రి: రాజమండ్రి బరిలో తెలుగుదేశం పార్టీ తరఫున నిలిచిన ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ ఈసారైనా గట్టెక్కేనా? ప్రత్యర్థుల నుండి ఆయన గట్టి సవాలే ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి గాలి బాగా వీచింది. అయితే, ఇప్పుడు అది కొంత తగ్గిందనే వాదన వినిపిస్తోంది.
రాజమండ్రి లోకసభ బరిలో టిడిపి నుండి మురళీ మోహన్, జగన్ పార్టీ నుండి బొడ్డు అనంతర వెంకట రమణ చౌదరి, కాంగ్రెస్ నుండి కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్, కిరణ్ పార్టీ నుండి ముళ్లపూడి సత్యనారాయణలు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ద్విముఖ పోటీ కనిపిస్తోంది. టిడిపి, జగన్ పార్టీ నువ్వానేనా అన్నట్లుగా ఉన్నాయి.
టిడిపి గాలి వీచినట్లే కనిపించింది. పొత్తులు, అసెంబ్లీ సెగ్మంట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అంతర్గత సమస్యలు టిడిపిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాజమండ్రి లోకసభ నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లాలకు విస్తరించి ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ సెగ్మంట్లు ఉన్నాయి.
రాజమండ్రి లోకసభ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికలో టిడిపి పార్టీ అనుసరించిన విధానం లోకసభ ఎన్నికలపై పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బిజెపి పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించి, ఇక్కడ టిడిపి టిక్కెట్టును ఆశిస్తున్న మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్ అసెంబ్లీని టిక్కెట్టు కేటాయించటంతో గందరగోళం ఏర్పడింది.
దాంతో బిజెపి అభ్యర్ధికి ఆశించిన మద్దతు టిడిపి నుండి ఎంత వరకు లభిస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. రెండు పార్టీల మధ్య సమన్వయం పైన ఆధారపడి ఉంది. దీంతో జగన్ పార్టీ మురళీ మోహన్తో పోటీ పోటీ కనిపిస్తోంది. మరోపక్క ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్ధులు పోటీపడుతుండటంతో, మధ్యలో మరో బలమైన సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్ధి కందుల దుర్గేష్ సామాజికవర్గ సమీకరణలపై ఆ పార్టీ ఆశలు పెట్టుకున్నారు.