బాబు పర్యటనలో జేబుదొంగ, కుమ్మేశారు: బస్సు బోల్తా
ఏలూరు/నల్గొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి పర్యటనలో జేబుదొంగలు పని చెప్పారు. జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు బుధవారం ఉదయం పశ్చి గోదావరి జిల్లాకు బయలుదేరి వెళ్లారు. నేడు, రేపు గోపాలపురం, చింతలపుడి నియోజకవర్గాల్లో బాబు పర్యటించనున్నారు.
పర్యటలో భాగంగా రైతులు, డ్వాక్రా సంఘాలు, పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు విడివిడిగా ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా, మధ్యాహ్నం ఆయన ద్వారకా తిరుమలకు చేరుకున్నారు. అక్కడ ఓ జేబుదొంగ హల్చల్ చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు జేబుదొంగను పట్టుకొని చితకబాదారు.
మాజీ సర్పంచ్ భర్త దారుణ హత్య
నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలం కొండమల్లేపల్లిలో మాజీ సర్పంచ్ భర్త రవికుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. రవి కుమార్ను అతని నివాసంలోనే దుండగులు కర్రలు, ఇనుపరాడ్లతో మోది చంపినట్లు తెలుస్తోంది. రవికుమార్ కుటుంబంలో హైదరాబాద్లో నివాసముంటున్నారు.
మంగళవారం ఓ పని నిమిత్తం కొండమలయ్యపల్లికి వచ్చిన రవి కుమార్ తన నివాసంలో బస చేశారు. కాగా ఉదయానికి రవికుమార్ రక్తపుమడుగుల్లో పడివున్నారు. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఘటనపై విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా: 12 మందికి గాయాలు
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్లో ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు గత అర్థరాత్రి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది స్వల్ప గాయాలవడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
బస్సు షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని మిగిలిని 29 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రత్యేక బస్సులో హైదరాబాద్కు తరలించారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రయాణికులు చెబుతున్నారు.