పవన్ కళ్యాణ్ వల్లే, పోరాడుతాం: బాబును ఏకేసిన రోజా
చిత్తూరు/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి శాసన సభ్యురాలు, ప్రముఖ నటి రోజు మంగళవారం నిప్పులు చెరిగారు. అదే సమయంలో జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లనే టీడీపీ ఎన్నికలలో గెలిచిందని ఆమె చెప్పారు.
ఆమె మంగళవారం చిత్తూరు జిల్లాలో మాట్లాడారు. రైతుల రుణమాఫీ పైన చంద్రబాబుకు ఏమాత్రం స్పష్టత లేదన్నరు. రైతులను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ పైన కాలయాపన చేసేందుకే ఆయన కమిటీలు అంటూ కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.
ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినప్పుడు రుణమాఫీకి ఎన్ని కోట్లు కావాలో చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిత్యం రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటుందని ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్ వల్లనే టీడీపీ ఇటీవల జరిగిన ఎన్నికలలో గెలుపొందిందని చెప్పారు.
గాలి బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఓఎంసి కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. 3 నెలల్లోగా ఓఎంసీ కేసు విచారణ పూర్తి చేయాలని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయిన తర్వాత బెయిల్ పిటిషన్ వేయాలని గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీం కోర్టు సూచించింది.