ఊహించనిదే: సబితా రెడ్డి, బీ పాజిటివ్ అని కేసీఆర్కి
హైదరాబాద్: గత ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి ఊహించని ఫలితాలు వచ్చాయని మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి శుక్రవారం అన్నారు. నరేంద్ర మోడీ ప్రభావం, సెటిలర్ల అంసం, జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల పార్టీ ఓడిపోయిందన్నారు. గాంధీ భవన్లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెసు పార్టీ సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టోను ప్రజలు నమ్మారన్నారు. కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లలేదన్నారు. తెరాస ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. హామీల అమలుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం తమ బాధ్యత అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి హామీలు నెరవేర్చకుండా ఎదురు దాడి చేస్తోందన్నారు. ఇది ఏమాత్రం సరికాదన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతి ఉంటే విచారణ జరిపించాలి తప్ప, పేదలకు అన్యాయం చేయవద్దన్నారు. హైదరాబాదులో అక్రమ నిర్మాణాల తొలగింపుపై స్పందిస్తూ.. సొంత ఇంటి పైమ మరో గది నిర్మించుకుంటే అక్రమమా? సబితా ప్రశ్నించారు.
ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిపై అదనపు గదులు కట్టుకున్న వారి ఇళ్లను క్రమబద్ధీకరించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాదు నగరంలోని అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పెద్దలు తమ విమర్శలను పాజిటివ్గా తీసుకోవాలన్నారు.
బ్రోకర్ల వల్లే: రంగారెడ్డి
కాంగ్రెస్ పార్టీని బ్రోకర్లే ముంచారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్ చుట్టూ తిరిగే బ్రోకర్లకే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారన్నారు. పార్టీ కోసం కష్టపడేవారిని కాదని లాబీయింగ్ చేసేవారికి ప్రాధాన్యతనిస్తే ఫలితాలు ఇలానే ఉంటాయన్నారు. గ్రూపు రాజకీయాలు మానకపోతే పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. వాస్తవాలు మరుగున పెట్టకుండా సోనియా గాంధీకి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమాచారం ఇవ్వాలన్నారు.