బాబుతో సదానంద, భేటీ ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఆయన ఆర్పీఎఫ్ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. అంతకుముందు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రూ.5 లక్షల కోట్ల విలువ చేసే పనులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. పెండింగు పనుల పూర్తిగా బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులు తేలేదని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వేలో 35 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ రైల్వే పరిధిలో రూ.21వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయన్నారు. 4,325 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైను నిర్మాణం తమ లక్ష్యమన్నారు.
సురక్షిత ప్రయాణం, ప్రయాణీకుల భద్రత, నాణ్యమైన సేవలు.. ఈ మూడు అంశాలకే తాము ప్రాధాన్యమిస్తున్నామన్నారు. యూపీఏ నిర్ణయాల వల్ల రైల్వే శాఖకు సంబంధించిన పలు పనులు పెండింగులో ఉన్నాయన్నారు. త్వరలో 17వేల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. రైల్వేల అభివృద్ధి కోసమే ఎఫ్డీఐలను ఆహ్వానించామన్నారు. దక్షిణ మధ్య రైల్వే అద్భుతామన్నారు.
ఆదర్శ పథకం రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వు
ఆదర్శ రైతు పథకాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాని స్థానంలో బహుళ ప్రయోజన విస్తరణ విధానం తీసుకు వస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
వచ్చే ఏడాది కొత్త ఎక్సైజ్ పాలసీ
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది కొత్త ఎక్సైజ్ విధానాన్ని తీసుకు వస్తామని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ విధానం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తరహాలో ఉంటుందన్నారు. తమిళనాడు విధానాన్ని పరిశీలిస్తామని చెప్పారు. వచ్చే బడ్జెట్లో ప్రజల పైన భారం పడదన్నారు.