అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
హైదరాబాద్: సద్దుల బతుకమ్మ వేడుకలు హైదరాబాదులో గురువారం సాయంత్రం ప్రారంభమైంది. బతుకమ్మల ఊరేగింపు గురువారం సాయంత్రం లాల్ బహదూర్ స్టేడియం నుంచి ప్రారంభమైంది. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. లేజర్ షోలు, ఫేరణీ నృత్యాలు, ఇతర కళాకారుల ప్రదర్శనలు, విద్యుద్దీపాల కాంతులు, బతుకమ్మ ఊరేగింపు హైదరాబాద్ రంగుల హరివిల్లుగా మారిపోయింది. ట్యాంక్బండ్ మీద నిర్వహించిన బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు అద్దం పట్టాయి. గవర్నర్ దంపతులు నరసింహన్, విమలా నరసింహన్లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆయన సతీమణి శోభ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో గవర్నర్ చూడచక్కగా కనిపించారు. విమలా నరసింహన్, శోభ బతుకమ్మ ఆడి, తమ ఆనందాన్ని పంచుకున్నారు.
నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తన బతుకమ్మను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేశారు. ఆమెతో పాటు తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా బతుకమ్మను నిమజ్జనం చేశారు.
ట్యాంక్బండ్ సాగరతీరం లేజర్ షోతో మెరిసిపోయింది. బతుకమ్మ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో వెలుగులు వీక్షకులకు కనువిందు చేశాయి.
హైదరాబాద్ ట్యాంక్బండ్పై కెసిఆర్ సతీమణి శోభ, గవర్నర్ నరసింహన్ సతీమణి విమలా నరసింహన్ బతుకమ్మ ఆడారు. వేడుకల్లో వారు కూడా పాల్గొన్నారు.
సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ట్యాంక్బండ్పై ప్రభుత్వ శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఈ శకటాల ప్రదర్శన ఏర్పాటైంది. ట్యాంక్బండ్ వద్ద జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన పూలకారు శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ట్యాంక్బండ్ వేదికపై తెప్పోత్సవం పుస్తకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక మాస పత్రిక తెలంగాణ తొలి సంచికను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవిష్కరించారు.
కాగా, బతుకమ్మ వేడుకల ప్రధాన వేదిక ట్యాంక్బండ్ మీద ఏర్పాటైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన సతీమణి శోభతో పాటు ప్రధాన వేదిక వద్దకు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో వేదిక వద్దకు చేరుకున్నారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అడుగడుగునా సిసి కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. బతుకమ్మ ఊరేగింపులో భారీగా మహిళలు పాల్గొన్నారు. తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను శిరస్సులపై ఉంచుకుని మహిళలు ఊరేగింపులో పాల్గొన్నారు. రెండు వేల మంది కళాకారులతో నృత్యరూపకాలు ప్రదర్శిస్తున్నారు.