సాక్షి: రుణమాఫీపై చంద్రబాబుకు రిజర్వ్ బ్యాంక్ షాక్
హైదరాబాద్: రుణమాఫీపై రిజర్వ్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు చెందిన సాక్షి మీడియా రాసింది. నిరుటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు పండ లేదని, అందుకే రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరిన ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ తాజా లేఖ ఇబ్బందికరంగా మారిందని సాక్షి మీడియా రాసింది.
సాక్షి మీడియా కథనం ప్రకారం - ఆంధ్రప్రదేశ్ అర్థ గణాంక శాఖ నుంచి సేకరించిన పంటల దిగుబడి వివరాల ఆధారంగా గత ఖరీఫ్లో పంటల దిగుబడి సాధారణం కన్నా 50 శాతానికి తగ్గలేదని రిజర్వ్ బ్యాంక్ అంటోంది. అందువల్ల ప్రకృతి వైపరీత్యం ఉందని చెప్పలేమని రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది.
ఈ స్థితిలో రుణాల రీషెడ్యూల్కు అనుమతి సాధ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపావలి పంత్ జోషీ లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. దీంతో గత ఖరీఫ్ రుణాలు రీషెడ్యూల్ అయితే రుణమాఫీపై కొంత కాలం నాన్చవచ్చుననే ఆలోచనలో ఉన్న చంద్రబాబు ప్రభు్వానికి ఎదురు దెబ్బ తగిలిందని సాక్షి మీడియా వ్యాఖ్యానించింది.
చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు రిజర్వ్ బ్యాంకుకు ఏ విధమైన సమాధానం ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నట్లు రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలనే జోషీ తన లేఖలో ఉటంకించడం వల్ల రిజర్వ్ బ్యాంక్ వాదనను ఖండించలేదని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం పడింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్తో మాట్లాడడానికి చంద్రబాబు ప్రయత్నం ఫలించలేదని, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అందుబాటులోకి రాలేదని సాక్షి మీడియా వ్యాఖ్యానించింది.