సానియా బ్రాండ్ అంబాసిడర్: కెసిఆర్ రాజకీయమా?
హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం వెనక ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాజకీయ వ్యూహం ఉందనే మాట వినిపిస్తోంది. హైదరాబాద్, దాని పరిసరాల్లో బిజెపి, తెలుగుదేశం పార్టీలు బలంగా ఉండడంతో మైనారిటీలను తన వైపు తిప్పుకునే ఉద్దేశంతో సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు విమర్శలు వస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నియమాకం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర పాలక సంస్థలో అధికారాన్ని కాంగ్రెసు, మజ్లీస్ కలిసి పంచుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ నగరపాలక సంస్థపై గెలుపు జెండా ఎగురేయాలనే గట్టి పట్టుదలతో కెసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఆ పార్టీలకు సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగా జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ మద్దతు పలికి, ప్రచారంలోకి దిగే అవకాశం ఉంది. దీంతో ఈ కూటమిని ఎదుర్కోవడానికి మైనారిటీల మద్దతు సంపాదించాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా, ఇప్పటికే మజ్లీస్తో కెసిఆర్ ఓ అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. అవసరమైతే మజ్లీస్తో కలిసి నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెరాస పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో నగరపాలక సంస్థ ఎన్నికలు జరగాల్సి ఉంది.
అయితే, సానియా మీర్జాకు మించిన బ్రాండ్ అంబాసిడర్ ఎవరుంటారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్గాలు అంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సానియా మీర్జా వల్ల తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నాయి. సానియా మీర్జా నియామకాన్ని బిజెపి నాయకులు తప్పు పడుతున్నారు. దీనికి సానియా మీర్జా నొచ్చుకున్నారు. తన తాతముత్తాతలు కూడా హైదరాబాదుకు చెందినవారేనని ఆమె ట్విట్టర్లో అన్నారు.