టి బ్రాండ్ అంబాసిడర్ సానియా, గర్విస్తున్నానని కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా (27)ను నియమించారు. ఇకపై ఆమె తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు భారత్లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ప్రచారం కల్పిస్తారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్లర చంద్రశేఖర రావు ఆమెకు నియామక పత్రంతో పాటు కోటి రూపాయల చెక్ కూడా అందించారు.
కేసీఆర్ నేడు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన సందర్భంగా సానియా నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సానియాను చూసి తెలంగాణ గర్విస్తోందన్నారు. ప్రస్తుతం మహిళల డబుల్స్ ర్యాంకుల్లో ఐదో స్థానంలో ఉన్న ఆమె అంతర్జాతీయ ర్యాంకుల్లో నెంబర్ వన్గా ఎదగాలని ఆకాంక్షించారు. సానియా స్వస్థలం హైదరాబాద్ కావడం మనందరికీ గర్వకారణమన్నారు.
కాగా, సోమవారం సానియా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన విషయం తెలిసిందే. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు శిక్షణ కోసం సానియా అమెరికా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎంను సోమవారం సచివాలయంలో కలిశారు. అకాడమీ ఏర్పాటు గురించి, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి గురించి ఆమె ముఖ్యమంత్రితో మాట్లాడారు.
క్రీడల అభివృద్ధికి సహకరించాలని కోరారు. యూఎస్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు శిక్షణకు అవసరమయ్యే ఖర్చు కోసం కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. హైదరాబాద్లో అకాడమీ ఏర్పాటు చేసే ఉద్దేశంతో గుత్తా జ్వాలా, పుల్లెల గోపిచంద్లు త్వరలోనే ముఖ్యమంత్రిని కలువనున్నారు.
పూర్తిస్థాయి రాష్ట్రంగా: కేటీఆర్
తెలంగాణను పూర్తిస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వేరుగా అన్నారు. తొలి కేబినెట్ భేటీలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత తెలంగాణ తెరాస ప్రభుత్వానిదే అన్నారు. గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు ఇస్తామని చెప్పారు.