కేసీఆర్కు 'పాక్' షాక్, చంద్రబాబుపై జగన్ సమరశంఖం
హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ బీజేపీ, తెలంగాణ టీడీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా... రుణమాఫీ పైన పరిమితి విధించడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమరశంఖం పూరించారు.
సానియాను తెలంగాణ అంబాసిడర్గా నియమించడంతో కేసీఆర్పై విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. ఫీజు రీయింబర్సుమెంట్స్ కోసం 1956 కట్ ఆఫ్ అని చెప్పిన కేసీఆర్.. మరో రాష్ట్రానికి చెందిన కూతురు, పాకిస్తాన్ కోడలు సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్గా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. రీయింబర్సుమెంట్స్ పేరుతో తెలంగాణ విద్యార్థుల జీవితాలతోను ఆటలాడుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా కాశ్మీర్, తెలంగాణ పైన కవిత చేసిన వ్యాఖ్యల పైన కూడా మండిపడుతున్నారు.
మరోవైపు, రైతు రుణమాఫీ పైన చంద్రబాబు ఒక్క అడుగు వెనక్కి వేసినా ఉద్యమించాలని మొదటి నుండి భావిస్తున్న వైయస్ జగన్.. రుణమాఫీకి పరిధి విధించడంతో కార్యాచరణ చేపట్టారు. రైతులకు రూ.లక్షన్నర, డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల రుణమాఫీ ఉంటుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనిపై జగన్ తూర్పార బట్టారు. విభజన జరిగితే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసి చంద్రబాబు హామీ ఎలా ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు.
చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోనందున గురువారం నుండి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తామని చెప్పారు. తమకు బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు పలకాలని ఆయన కోరారు. అయితే, జగన్ వ్యాఖ్యల పైన టీడీపీ కూడా ధీటుగానే స్పందించింది. రాష్ట్రం పరిస్థితి తెలిసి కూడా జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ తాము రుణమాఫీ పైన ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, ముందు ముందు రైతులకు, మహిళలకు, అన్ని వర్గాల వారికి పూర్తి న్యాయం చేస్తామని ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, పత్తిపాటి పుల్లారావు తదితరులు అన్నారు. చంద్రబాబును జగన్ నరకాసురుడితో పోలిస్తే.. టీడీపీ మంత్రులు జగన్ను నరకాసురుడు, బకాసురుడితో పోల్చారు.