సానియా సెంటిమెంట్: లక్ష్మణ్ వ్యాఖ్యలపై బిజెపి వెనక్కి
హైదరాబహాద్: తనను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై బిజెపి నాయకుడు కె. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. హైదరాబాదుతో తనకూ తన తాతముత్తాతలకు ఉన్న అనుబంధాన్ని తవ్విపోశారు. ట్విట్టర్లో ఆమె చేసిన వ్యాఖ్యలు బిజెపి జాతీయ నాయకులను చిక్కుల్లో పడేసినట్లు కనిపిస్తున్నాయి.
అంతేకాకుండా, కాంగ్రెసు నాయకురాలు రేణుకా చౌదరి స్త్రీపురుష వివక్షను ప్రస్తావించారు. ఓ పురుషుడు బ్రాండ్ అంబాసిడర్ అయితే హర్షించేవారు ఓ మహిళ అయితే విమర్శలు చేస్తారని ఆమె అన్నారు. సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడాన్ని ఆమె పూర్తిగా సమర్థించారు. ఈ స్థితిలో బిజెపి జాతీయ నాయకులు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితిలో పడ్డారు.
తెలంగాణ బిజెపి నేత డాక్టర్ కె. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను బిజెపి జాతీయ నేత ప్రకాష్ జవదేకర్ తోసిపుచ్చారు. పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. సానియా మీర్జా భారతదేశానికి గర్వకారణమని అన్నారు. సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్ కావడంపై తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని ఆయన అన్నారు. సానియా భారత బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు.
బిజెపి నేత మురళీ మనోహర్ జోషీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎవరైనా ఓ ప్రకటన చేస్తే, అది ఆ వ్యక్తి సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అన్నారు.
సానియా మీర్జా నియామకంపై లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యను మూర్ఖత్వంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు వ్యాఖ్యానించారు. నియామకంపై ఎవరేమన్నారే విషయం తమకు అవసరం లేదని, సానియా అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించారని ఆయన అన్నారు.
సానియా భారతీయురాలని, భారతదేశం తరఫున ఆడుతున్నారని, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఆమె నియామకం సమస్య కాదని సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు. సానియా భారత దేశం కూతురు అని, టెన్నిస్ క్రీడలో భారతదేశానికి విశేషమైన కీర్తిని తెచ్చి పెట్టారని కిరణ్ బేడీ అన్నారు. సానియా బ్రాండ్ అబాసిడర్ అని, సానియా భారత్, పాకిస్తాన్ - ఇరు దేశాల కోసం విజయాలు సాధిస్తారని, అది ఇంకా మంచిదని, సానియా కఠిన శ్రమ నుంచి రెండు దేశాలు ప్రయోజనం పొందాలని, యువతకు సానియా స్ఫూర్తి అని కిరణ్ బేడీ అన్నారు.
సానియా నియామకంపై లక్ష్మణ్ వ్యాఖ్యలపై వ్యతిరేకత తీవ్రం కావడంతో బిజెపి నాయకులు దిగి వచ్చారు. లక్ష్మణ్ వ్యాఖ్యల తప్పు పడుతూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, మురళీ మనోహర్ జోషీ ప్రకటనలు చేశారు.