ఎంసెట్పై ఏపీ X తెలంగాణ, సస్పెన్స్: 4దాకా వాయిదా
న్యూఢిల్లీ: ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ పైన సస్పెన్స్ కొనసాగుతోంది! ఎంసెట్ కౌన్సిలింగ్పై విచారణను సుప్రీం కోర్టు ఆగస్టు 4కు వాయిదా వేసింది. సోమవారం ఉదయం ఎంసెట్ కౌన్సిలింగ్పై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ పైన విచారణ జరిగింది. ఈ కేసుపై ఏఐసీటీఈ, ఏపీ ప్రభుత్వం జవాబు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
న్యాయమూర్తులు సుధాంశు జ్యోతి ముఖోపాధ్యాయ, ఎస్ఏఎన్ బాబ్డీల్తో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రముఖ సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వే వాదించారు. విభజన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం జరగలేదని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్పై స్పష్టత లేనందున ఎంసెట్ కౌన్సిలింగ్ను అక్టోబర్ 31 వరకు వాయిదా వేయాలని న్యాయవాది హరీష్ కోర్టును కోరారు.
అయితే హరీష్ వాదనను ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది గంగోలీ తీవ్రంగా వ్యతిరేకించారు. కౌంటర్ అఫిడవిట్గాని, రిప్లయిగానీ ఏపీ ప్రభుత్వం నుంచి ధాఖలు చేయలేదని, అంతేకాకుండా కౌన్సింగ్ వాయిదాపై ఏఐసీటీఈ అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉన్నందున ఏఐసీటీఈ ఈ కేసులో ప్రతివాదగా చేర్చాల్సిన అవసరం ఉందని సుప్రీం భావించింది.
ఈ నేపథ్యంలో ఏఐసీటీఈతో పాటు ఏపీ ప్రభుత్వం రిప్లయి దాఖలు చేసిన తర్వాత ఈ కేసుపై విచారణ జరుపుతామంటూ సుప్రీం ఈ కేసుకు ఆగష్టు 4కు వాయిదా వేసింది. అయితే ఏపీ ప్రభుత్వం తరపున సోమవారం సాయంత్రానికే రిప్లయి పిటిషన్ దాఖలు చేస్తామని కేసును రేపటికి వాయిదా వేయాలన్న ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనను తోసిపుచ్చుతూ తదుపరి విచారణను ఆగస్టు 4న చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విచారణ వాయిదా నేపథ్యంలో నాలుగో తారీఖు వరకు కౌన్సిల్ ఉండకపోవచ్చు.