మే 7 తర్వాతే, 'సార్వత్రిక'పై 'మున్సిపల్' ప్రభావం: సుప్రీం
న్యూఢిల్లీ: మే 7వ తేదీ తర్వాతనే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల ప్రకటించాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సోమవారం ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల పైన మున్సిపల్ ఎన్నికల ప్రభావం ఉంటుందని సుప్రీం కోర్టు చెప్పింది. కాబట్టి ఫలితాలను వాయిదా వేయాలని ఆదేశించింది.
సాంకేతిక కారణాలను చూపి ఫలితాలను వాయిదా వేయలేమని అడగవద్దని తెలిపింది. పరిషత్ ఎన్నికల్లో ఒక వైఖరి, మున్సిపల్ ఎన్నికల్లో మరో వైఖరా అని న్యాయస్థానం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. కాగా, ఈవిఎంలను భద్రపర్చలేమని చెప్పి గతంలో సుప్రీం కోర్టుకు ఎన్నికల సంఘం చెప్పింది. దీంతో సాంకేతిక కారణాలు చూపించవద్దని ఈసారి ఆదేశించింది.
కాగా, సుప్రీం కోర్టు ఉత్తర్వులు తమకు ఇంకా అందలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. తాము కోర్టు తీర్పు ప్రకారమే నడుచుకుంటామని చెప్పింది. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వాయిదా వేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ పైన సుప్రీం కోర్టు, హైకోర్టులలో విచారణ జరిగింది. హైకోర్టు ఈ నెల 9వ తేదీలోగా ఫలితాలు విడుదల చేయాలని చెప్పగా.. ఇటీవల సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ రోజు... మే 7 తర్వాతనే విడుదల చేయాలని ఆదేశించింది.