రేపు లిస్ట్: రఘువీరా, చిరు హ్యాపీ: జగన్ పార్టీలో చిచ్చు
హైదరాబాద్: : సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాను రేపు ఖరారు చేసి ప్రటకన చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు రఘవీరా రెడ్డి చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా టిక్కెట్ల కేటాయింపు చేపట్టామన్నారు. 200 సీట్లకు గానూ 37 సీట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయన్నారు.
ఆ సీట్లను ఈ రోజు సాయంత్రం గానీ, సోమవారం ఉదయం కానీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. టిక్కెట్ల పైన చర్చ దాదాపు పూర్తయిందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సీమాంధ్ర ప్రాంతంలోనూ పర్యటిస్తారని రఘువీరా రెడ్డి చెప్పారు.
తెలుగుదేశం పార్టీని వీడిన అనంతపురం జిల్లాకు చెందిన వాల్మీకి, సామాజిక వర్గం నేతలు రఘువీరారెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ... వారు కాంగ్రెస్లో చేరడం చాలా సంతోషమన్నారు.
పేర్ని నాని లేఖ
మచిలీపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం వచ్చింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయలేనని మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆదివారం పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు. ఇంత వరకు తనను ఆదరించిన కార్యకర్తలు, అభిమానులు, అనుచరులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పోటీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టే స్థోమత తనకు లేదని, అందుకే పోటీకి, నేతలు, కార్యకర్తలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన చెప్పారు.
మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం స్నేహితుని నుంచి రూ 1.30 కోట్లు అప్పు తెచ్చానని, తన ఇంటిని తాకట్టు పెట్టి కూడా రూ 70 లక్షలు అప్పు తీసుకువచ్చానన్నారు. తన తల్లి అనారోగ్యంతో ఉంటే ఆస్పత్రిలో చేర్చించానని, ప్రస్తుతం తన వద్ద డబ్బు లేదని నాని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ చేయాలని జగన్ చెప్పారని, అందరం కష్టాల్లో ఉన్నామని, పోటీ చేయలేనని జగన్కు చెప్పానని తెలిపారు.