బాబుకు నోఎంట్రీ, మీరైతే ఓకే: టిడిపి కార్యకర్తలకు షర్మిల
విశాఖ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల గురువారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు నో ఎంట్రీ అని, తెలుగు తమ్ముళ్లు అయితే రావొచ్చునని ఆమె వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గురువారం విశాఖ లోకసభకు నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. వైయస్ రెక్కల కష్టం మీద వచ్చిన కాంగ్రెసు ప్రభుత్వం.. ఆయన పథకాలను నీరుగార్చిందని విమర్శించారు. ఈ ఐదేళ్ల పాటు కాంగ్రెసు ప్రభుత్వాన్ని చంద్రబాబు మోశారన్నారు. అవినీతి ఆరోపణల నుండి తప్పించుకోవడానికే బాబు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. పిల్లనిచ్చిన అల్లుడని ఆదరిస్తే మామకు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు.
షర్మిల మాట్లాడుతున్న సమయంలో పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అటుగా వచ్చారు. ఈ సమయంలో ఆమె ఆసక్తికరంగా స్పందించారు. తమ పార్టీలోకి చంద్రబాబుకు నో ఎంట్రీ అని, తెలుగు తమ్ముళ్లు మాత్రం రావొచ్చునని చెప్పారు.
విశాఖపట్నం లోకసభ స్థానానికి విజయమ్మ గురువారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మాట్లాడారు. పార్లమెంట్ స్థానానికి గెలిచిన తర్వాత విశాఖ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అలాగే విశాఖను గ్రీన్ సిటీ, కాలుష్యరహిత నగరంగా చేస్తామని వైయస్ జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చుతామన్నారు.
పేదల సంక్షేమం కోసం జగన్ పాటుపడుతున్నారని, ప్రజలకు వైయస్ లేని లోటు తీరుస్తారని విజయమ్మ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాగానే పేదల సంక్షేమం కోసం జగన్ అయిదు సంతకాలు చేస్తారని ఆమె గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం పాటుపడతామని ఆమె తెలిపారు.