తాత్కాలిక రాజధాని చేటు: బాబుకు ఎదురుదెబ్బ
హైదరాబాద్: ఉమ్మడి రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రుల కార్యాలయాలు, సచివాలయాల విషయంలో మాత్రం రోజూ అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని అందువల్ల ఆంధ్ర ప్రదేశ్ సీఎం కార్యాలయం, సచివాల యంపై వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది.
అయితే వీటిని ఎక్కడో ఒకచోట తాత్కాలికంగా పెట్టి, ఆ తర్వాత తరలిస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైనంత త్వరగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను నిర్ణయించుకోవాలని అభిప్రాయపడింది. విజయవాడకు తాత్కాలికంగా కార్యాలయాలను తరలించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆలోచనకు విఘాతం కలిగినట్లే.
విశాఖపట్నంలో హైకోర్టును పెట్టవచ్చునని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. రాయలసీమలో ఓ చోట హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది.అన్ని సౌకర్యాలతో కూడిన హైకోర్టును ఏర్పాటు చేసేందుకు 3 నుంచి 5 ఏళ్ల సమయం పడుతుందని కమిటీ అభిప్రాయపడింది.
మీడియా కథనాల ప్రకారం - వీలైతే అసెంబ్లీ, సచివాలయాలు ఏర్పాటు చేసే ప్రాంతంలోనే హైకోర్టును కూడా పెట్టొచ్చు లేదా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల తరహాలో సంజీవయ్య జాతీయ న్యాయ విద్యాలయం ఉన్న విశాఖపట్నంలో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునని అభిప్రాయపడింది. హైకోర్టు ఒక్కదానినే ప్రత్యేకంగా చూడరాదని. మరో పది ట్రిబ్యునళ్లు, కమిషన్లు కూడా రాష్ట్ర న్యాయ పాలనా వ్యవస్థ పరిధిలో ఉంటాయని తెలిపింది.
న్యాయవాదులు హైకోర్టుతోపాటు ఈ సంస్థలకు కూడా హాజరవుతుంటారు కాబట్టి ఈ సంస్థలన్నింటినీ ఒకేచోట ఉంచడం మంచిదని తెలిపింది. హైకోర్టు, ఇతర న్యాయ సంస్థలు ఎక్కడ ఏర్పాటు చేసినప్పటికీ హైకోర్టు బెంచ్ను రాయలసీమలో ఒక చోట ఏర్పాటు చేయాలని సూచించింది. అసెంబ్లీ, సచివాలయం ఉన్నచోటే హైకోర్టును ఏర్పాటు చేయటం తప్పనిసరి కాదని చెబుతూ కేరళ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను ఉదహరించింది.
రాజధానితో ముడిపడిన పరిపాలనా విభాగాలను, ఇతర సంస్థలను ఒకేచోట కాకుండా మూడుచోట్ల వికేంద్రీకరించాలని కమిటీ సూచించింది. వీటికి విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర సబ్రీజన్, రాయలసీమ ఆర్క్ (చాపం), శ్రీకాళహస్తి-నడికుడి రేఖగా నామకరణం చేసింది.
శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు ఉండే విశాఖ జోన్లో పరిశ్రమలు, ఉత్పత్తి, రేవులు, నౌకాయానం, పెట్రోకెమికల్, సాంకేతిక విద్యకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం ఈ రంగాలకు సంబంధించి హైదరాబాద్లో ఉన్న 109 ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడికి తరలించాలని తెలిపింది. వైజాగ్ ప్రాంతం హైటెక్ జోన్గా అభివృద్ధి చెందే అవకాశముందని తెలిపింది.