చిరు గో బ్యాక్ అన్న కార్యకర్తలు, కడపలో కాంగ్రెస్కి షాక్
విశాఖ: ఎన్నికల ప్రచార సమయంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు ప్రచార సారథి చిరంజీవికి షాక్ తగిలింది. ఎన్నికల ప్రచార సభకు హాజరైన కొంతమంది చిరంజీవి గో బ్యాక్ అంటూ గాజువాకలో నినాదాలు చేశారు. నినాదాలు చేసిన వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు, కార్మిక నేతలు ఉన్నారు. టికెట్లు అమ్ముకున్న నేతలారా గో బ్యాక్ అంటూ వారు ధ్వజమెత్తారు. గాజువాక టిక్కెట్ను స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఇచ్చారని వారు ఆరోపించారు.
కాగా, హిట్లర్ లాంటి మోడీతో చంద్రబాబు పొత్తు ఎలా పెట్టుకున్నారని చిరంజీవి ప్రశ్నించారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ మోడీ ఓ నియంత... బిజెపిని కబ్జా చేశారన్నారు. వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడానికే పార్టీని వాడుకుంటున్నారన్నారు. మతతత్వ మోడీ అధికారంలోకి వస్తే దేశానికి ప్రమాదమన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే కార్పోరేట్ సంస్థలే రాజ్యమేలుతాయన్నారు. ఎన్నికల తర్వాత బిజెపికే జగన్ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు.
కడపలో కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. రాష్ట్ర విభజనతో ఆ పార్టీకి చెందిన నేతలు ఎవరిదారి వారు చూసుకుంటుండగా అధిష్టానం జోక్యంతో కొంతమంది సీనియర్లు మాత్రం ఆగిపోయారు. పార్టీ మెల్లగా కుదుట పడుతుందనుకుంటున్న తరుణంలో మాజీమంత్రి కడప సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మదుల్లా టికెట్ల పంపిణీ వ్యవహారం వికటించింది.
పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్లు కేటాయించడానికి నిరసనగా ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్, డిసిసి చైర్మన్ మాకం అశోక్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి బండి ప్రభాకర్, సేవాదళ్ జిల్లా మాజీ అధ్యక్షుడు మట్లి వేణుగోపాల్ రెడ్డి తదితరులు మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. కాగా, వారితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి తదితరులు వారితో చర్చలు జరిపారు. వారు త్వరలో జగన్ పార్టీలో చేరే అవకాశాలున్నాయంటున్నారు.