తెరాస పాత్ర లేదు: సోనియా, బిజెపీ, టిడిపిలపై విసుర్లు
కరీంనగర్: హైదరాబాద్ రెవెన్యూ తెలంగాణఁకే దక్కుతుందని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ వికాసానికి కాంగ్రెసు కట్టుబడి ఉందని చెప్పారు. దేశం కోసం ఇందిర, రాజీవ్ ప్రాణాలు అర్పించారని ఆమె అన్నారు. తెలంగాణకు పదేళ్ల పాటు టాక్స్ హాలిడే ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ ప్రచార సభలో ఆమె బుధవారం సాయంత్రం ప్రసంగించారు. బిజెపి, సంఘ్ పరివార్ మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. మతతత్వ శక్తుల ఆట కట్టించే సమయం వచ్చిందని ఆమె అన్నారు. తెరాస మాయమాటలు నమ్మవద్దని ఆమె పిలుపునిచ్చారు. సీమాంధ్ర ప్రజలతో సఖ్యంగా మెలగాలని సూచించారు.
సోనియా గాంధీకి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వాగతం చెప్పారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా వచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రసంగించారు. కాంగ్రెసు పార్టీనే తెలంగాణ ఇచ్చిందని సోనియా చెప్పారు. హామీ ఇచ్చినమేరకు తెలంగాణ కల నెరవేర్చామని ఆణె చెప్పారు. లౌకిక విలువలను కాపాడడంలో తెలంగాణ ప్రజల కృషి మరువలేనిదని ఆమె అన్నారు.
రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసుకోవడానికి తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు అలుపెరుగని పోరాటం చేశారని, 60 తెలంగాణ ప్రజలను కాంగ్రెసు సాకారం చేసిందని సోనియా గాంధీ చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెసు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని ఆమె చెప్పారు. తెలంగాణను అడ్డుకోవడానికి బిజెపి చివరి వరకు ప్రయత్నం చేసిందని ఆమె విమర్శించారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రతిపాదించడంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాత్ర ఏమీ లేదని ఆమె చెప్పారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలు చేశాయని ఆమె విమర్శించారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేస్తామని, ఆందోళన చెందవద్దని ఆమె అన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలనేదే తమ లక్ష్యమని ఆమె అన్నారు. మతతత్వ శక్తుల ఆట కట్టించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం ముగిసిందని, ఇక తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆణె అన్నారు. తెలంగాణపై అందరినీ ఒప్పించడానికి సమయం పట్టిందని సోనియా అన్నారు. సభ ముగిసిన తర్వాత ఆమె వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ కొంత దూరం ప్రయాణించారు.