జీరో బేస్డ్, విభజన ఎఫెక్ట్: బాబు, జగన్ పార్టీకి హెచ్చరిక
హైదరాబాద్: విభజన వల్ల జరిగిన నష్టం బడ్జెట్లో స్పష్టంగా కనిపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. విభజన వల్ల వచ్చిన లోటు బడ్జెట్కు కేంద్రం సాయం చేయాలని ఆయన కోరారు. అవినీతి వల్ల వ్యవస్థలు అన్ని భ్రష్టు పట్టాయన్నారు. అవినీతి జరిగిందని ఈడీ కూడా నిర్ధారించిందని చెప్పారు.
ఓ వైపు అవినీతి, మరోవైపు విభజన వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. గత రెండు నెలలుగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. తాము ప్రవేశ పెట్టింది.. జీరో బేస్డ్ బడ్జెట్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు బడ్జెట్ పైన ఏమాత్రం అవగాహన లేదన్నారు.
కాగా, పిచ్చిపిచ్చిగా చేస్తే అణచివేస్తానని చంద్రబాబు మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి హెచ్చరిక చేసిన విషయం తెలిసిందే. ఏటీఎంల్లో దొంగ నోట్లు పెట్టినవాళ్లు, దొంగ నోట్లు చెలామణీ చేయించినవాళ్లు, మద్యం సెకండ్స్ విక్రయించిన వాళ్లు, ఎర్ర చందనం స్మగ్లర్లు, ఇసుక, భూముల దందాలు, హత్యా రాజకీయాలు నడిపినవాళ్లతో నిండిన పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అని, ఆ పార్టీ నేతలు కూడా అసెంబ్లీలో నిలబడి హత్యా రాజకీయాల గురించి మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుందని చంద్రబాబు మంగళవారం అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిస్తే ప్రజలు ఊళ్లలో కూడా ఉండగలిగేవాళ్లు కారని, వాళ్లను చూసి భయపడిపోయే మమ్మల్ని గెలిపించారని, ఆ పార్టీ చెప్పినట్లు చేయడానికి తాము ఇక్కడకు రాలేదని, ఈ విషయం ఆ పార్టీ నేతలు గుర్తుంచుకొంటే మంచిదన్నారు. అసెంబ్లీకి మొదటిసారి వచ్చిన వాళ్లు కూడా సభా సంప్రదాయాలు, పద్ధతులు తెలియకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తే బాధ కలుగుతోందన్నారు.
ఒక ఎమ్మెల్యే ఏకంగా మంత్రి వద్దకు వచ్చి ఆయన మాట్లాడుతుంటే ముఖానికి అడ్డుగా ప్లకార్డు పెట్టడం దీనికి పరాకాష్ట అన్నారు. ప్రభుత్వం వచ్చి ఇంకా రెండు నెలలు కూడా కాలేదని, ఇంకా పూర్తిగా సర్దుకోను కూడా సర్దుకోలేదని, అధికారుల విభజన పూర్తి కాలేదని, ఆదాయం ఎంత వస్తుందో తెలియదని, కేంద్రం ఏం ఇస్తుందో స్పష్టత లేదని, ఈ బాధల్లో తాము ఉంటే ప్రజా సమస్యలను గాలికి వదిలి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన సొంత ఎజెండాను సభపై రుద్దాలని చూస్తోందన్నారు.
తాను 30 ఏళ్లుగా సభలో ఉన్నానని, మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించానని, రెండుసార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని, మొదటిసారి సభకు వచ్చినవాళ్లు శాసించినట్లుగా మేం నడవాలా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చేది చొక్కాలు పట్టుకోవడానికి, మీసాలు తిప్పడానికి కాదనేది గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. పరిటాల రవిని చంపినప్పుడు సభలో తనను మాట్లాడనీయలేదన్నారు. తాను శాంతి భద్రతల విషయంలో రాజీపడనని చెప్పారు. పిచ్చిపిచ్చిగా చేస్తే సహించేది లేదన్నారు.