చిరంజీవి టు కోట్ల ఏం చేస్తున్నారు: గొడ్ల చావడిలో మాజీ
హైదరాబాద్: ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో దేశవ్యాప్తంగా కాంగ్రెసు పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అయితే పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన పలువురు మాజీ మంత్రులు ఇప్పుడు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు.
చిరంజీవి తన 150వ సినిమా పైన దృష్టి సారించారు. ఇక మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అయితే వ్యవసాయం చేసుకుంటున్నారు. కేంద్రమంత్రిగా వెలుగు వెలిగిన ఆయన సాధారణ జీవితానికి పరిమితమయ్యారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ వ్యవసాయాన్ని వదులుకోలేదన్నారు. కర్నూలు జిల్లా లద్దగిరి సమీపంలోని వెల్దుర్తిలోని వ్యవసాయ క్షేత్రంలోని 50 ఎకరాల మామిడి తోటలో 25 రకాల మామిడి పండ్లను పండిస్తున్నానని, గతంలో రెండు ఆవులను కొన్నానని, ఇప్పడు వాటి సంఖ్య 100కి చేరిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటుందని త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చిరంజీవి
మాజీ పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తన 150వ సినిమా పైన దృష్టి సారించారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించాక చిరంజీవి సినిమాలకు దూరమయ్యారు. కాంగ్రెసు పార్టీలో చేరి కేంద్రమంత్రి అయ్యాక పూర్తిగా బిజీ అయిపోయారు. దీంతో చాలా రోజులుగా.. చిరంజీవి 150వ సినిమా ఇదిగో.. ఇదిగో అన్న మాదిరిగా తయారయింది. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెసు పార్టీ లేదు. రాష్ట్రంలోను ఆ పార్టీ లేదు. దీంతో అతను తన మైలురాయి చిత్రం పైన దృష్టి సారించారు.
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆయన పొలానికి వెళ్తూ, గొడ్ల చావడిలో ఆవులతో కనిపిస్తున్నారట.
కిరణ్ కుమార్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారట. ఆయన కూతురు అమెరికాలో చదువుతున్నారు.
కిల్లి కృపారాణి
మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త కిల్లి రామ్మోహన్ రావులు వైద్యులు. వారికి ఓ ఆసుపత్రి ఉంది. ఇప్పుడు వారు మరోసారి వైద్యుల అవతారం ఎత్తారు.
పళ్లం రాజు
సార్వత్రిక ఎన్నికల తర్వాత 'మాజీ' అయిన మాజీ కేంద్రమంత్రి పళ్లం రాజు ఎన్నికలు కాగానే లండన్ వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకున్నారట. ఆయన కూతురు లండన్లో చదువుతున్నారు.
కన్నబాబు
విలేకరి నుండి రాజకీయ నాయకుడిగా మారిన కన్నబాబు ఇప్పుడు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. పుస్తకాలు చదువుతున్నారు. రచనలు చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక, మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పి బాలరాజు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు సమయం కూడా దొరికేది. ఇప్పుడు సమయం దొరుకుతుందని ఆయన చెబుతున్నారట. అలాగే పుస్తకాలు చదువుతున్నారట.
నాదెండ్ల మనోహర్
మాజీ సభాపతి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. స్పీకర్గా ఉన్న సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా సమయం దొరకలేదని, ప్రస్తుతం కుటుంబ సభ్యులతో గడుపుతున్నానని ఆయన చెబుతున్నారట.