కంట్లో కారం చల్లిన దొంగల ఊహాచిత్రాలు (పిక్చర్)
హైదరాబాద్: మహిళ కంట్లో కారం కొట్టి, ఇంట్లో బంధించి నగలు, నగదు దోచుకుని వెళ్లిన ఘటనలో హైదరాబాదులోని ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అనుమానితుల ఊహాచిత్రాలను మీడియాకు విడుదల చేశారు. బాధిత మహిళ అందించిన సమాచారం మేరకు పోలీసులు దోపిడీకి పాల్పడినట్లు భావిస్తున్న ఇద్దరి ఊహాచిత్రాలను రూపొందించారు.
దోపిడీ దొంగల ఆచూకీ తెలిసినవారు వెంటనే ముషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించాలని, ఇందుకు సహకరించినవారికి పారితోషికం ఇస్తామని ఎసిపి అమర్కాంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే పోలీసు శాఖ తరఫున సిసి కెమెరాల ఏర్పాట్లు జరుగుతున్నాయని, జనావాస ప్రాంతాల్లో ప్రజలు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుని తమకు సహకరించాలని ఆయన అన్నారు.
ఈ నెల 20వ తేదీన ముషీరాబాద్ ఏక్ మినార్ మసీదు ప్రాంతానికి చెందిన అమీనా బేగం (50) అనే మహిళ కంట్లో దుండగులు కార కొట్టి నోట్లో గుడ్డలు కుక్కి, ఆ తర్వాత బంధించి దోపిడీకి పాల్పడ్డారు.
అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐలు గోపాల్, రాంప్రసాద్, కౌశిక్ పాల్గొన్నారు.