సింగిల్గా, అప్పటివరకైనా బాబుకు నో!: షాకు టీ-బీజేపీ
హైదరాబాద్: కనీసం 2019 ఎన్నికల వరకైనా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు ఊసెత్తవద్దని తెలంగాణ బీజేపీ నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కోరనున్నారట. గురువారం మధ్యాహ్నం అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు.
త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో పార్టీ గెలుపుపై వ్యూహరచన చేయనున్నారు. పలువురు నాయకులు, కార్యకర్తలు, పదాధికారులతో మాట్లాడనున్నారు. అమిత్ షా రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సమయంలో ఆయన టీడీపీతో పొత్తు విషయమై పార్టీ నేతలకు ఓ క్లారిటీ ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
బీజేపీ తొలి నుండి తెలంగాణకు అనుకూలంగా ఉంది. టీడీపీ తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడింది. ఈ సమయంలో సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తుకు నో చెబుతున్నారు. ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డి సహా తెలంగాణ బీజేపి నేతలు వద్దని చెప్పినప్పటికీ జాతీయ నాయకత్వం టీడీపీతో పొత్తుకు మొగ్గు చూపింది. దీంతో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. అదే సమయంలో బీజేపీ వల్ల టీడీపీకి లబ్ధి చేకూరిందనే వాదనలు ఉన్నాయి.
త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మరోసారి బీజేపీ నేతలు టీడీపీతో కలిసి వెళ్లవద్దనే అంశాన్ని అమిత్ షా ముందు పెట్టనున్నారట. కనీసం 2019 ఎన్నికల వరకు అయినా టీడీపీ ఊసెత్తకుంటే, అప్పటి వరకు బీజేపీ తెలంగాణలో బలపడుతుందని వారు భావిస్తున్నారు. టీడీపీతో పొత్తు వల్ల తమకు నష్టమే తప్ప లాభం లేదని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని అమిత్ షాకు చెప్పి గ్రేటర్ ఎన్నికల్లోను టీడీపీతో జతకట్టవద్దని కోరనున్నారట. 2019 వరకు అధికార తెరాస పైన బీజేపీ.. టీడీపీతో కలవకుండా, ఒంటరిగా పోరు చేసేలా చర్యలు తీసుకోవాలని, టీడీపీతో పొత్తు మాటను పక్కన పెట్టాలని సూచించనున్నారట.
అయితే, మరో వాదన కూడా ఉంది. తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో టీడీపీ పరిస్థితి ఆశాజనకంగా లేనప్పటికీ గ్రేటర్ పరిధిలో మాత్రం ఆ పార్టీ ప్రభావం ఎక్కువగానే ఉంటుందనే వారు లేకపోలేదు. ఆ కారణంగానే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాల్లో టీడీపీ, బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు గెలవకున్నా గ్రేటర్లో మాత్రం మిగతా పార్టీలను మట్టి కరిపించాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిస్తేనే బాగుంటుందనే అభిప్రాయం ఇంకొందరు వ్యక్తం చేస్తున్నారు.