తలసానితో బాలయ్య, జగన్ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
తాను కర్రసాయం లేకుండా నడుస్తున్నానని బాలయ్య తెలిపారు. మరోవైపు, తన నియోజకవర్గమైన హిందూపురంలో బుధవారం నుండి పర్యటించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల సస్పెన్షన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలను సభాపతి కోడెల శివప్రసాద్ రావు సస్పెండ్ చేశారు. సభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైంది. సభలో సభాపతి మైక్ లాగేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలను సభ నుండి సస్పెండ్ చేయాలని ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ప్రవేశ పెట్టారు.
దీంతో వారిద్దరిపై బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేటు పడింది. సస్పెండైన సభ్యులు బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశించారు.
మరోవైపు, తన పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన టీడీపీ పైన చెవిరెడ్డి భాస్కర రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఏనాడు స్పీకర్ను అగౌరవపరచలేదని, అలాంటి తన పైన టీడీపీ ఉల్లంఘన నోటీసు ఇవ్వడం సమంజసం కాదన్నారు. తమకు సమాన అవకాశం కల్పించాలని మాత్రమే తాను కోరినట్లు తెలిపారు.
స్పీకర్ను అగౌరవపర్చాలని తనకు ఏనాడు లేదన్నారు. అధికారపక్షం ఎన్నిసార్లు అసభ్యపదజాలం వాడినా స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కొంతమంది అధికార పార్టీ సభ్యులు తమ పార్టీ వారిని పందికొక్కులు అంటూ తీవ్ర భాష ఉపయోగించారని, వాళ్లమీద ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
గోరంట్ల ఎద్దేవా
అసెంబ్లీలో పదేపదే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు స్సీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తుండడంపై టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి సభలో తీవ్రంగా మండిపడ్డారు. తమకు ఎక్కువ సమయం కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష సభ్యుల బతుకే పోడియం అయిపోయిందని ఎద్దేవా చేశారు. స్పీకర్ వారి పైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి అసెంబ్లీ ఏమీ ఆయన లోటస్ పాండ్ కాదని, వైయస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో.. ఇప్పుడు ఈయనెలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలన్నారు. కాగా, నిరసనల మధ్య ఏపీ శాసన సభ బుధవారానికి వాయిదా పడింది.