కెసిఆర్తో భేటీకానున్న తలసాని: తెరాసలోకి ఎమ్మెల్యేలు
హైదరాబాద్/ఖమ్మం: సనత్నగర్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో భేటీ కానున్నారు. సోమవారం ఉదయం 10గంటలకు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ భేటీ ఉంటుందని సమాచారం.
ఈ భేటీలో పద్మారావునగర్ డివిజన్ ఐడిహెచ్కాలనీలో శిథిలావస్థకు చేరిన ఇళ్లు పునర్నిర్మించే విషయంలో సిఎం కెసిఆర్తో తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చించనున్నారు. కాగా, గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో తలసాని శ్రీనివాస్ చేరతారంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కెసిఆర్తో భేటీ కావడంపై ప్రాధాన్యత నెలకొంది.
టిఆర్ఎస్లోకి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సమక్షంలో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు తెలంగాణ రాష్ట్ర సమితిలో సోమవారం సాయంత్రం చేరనున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్లాల్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు వెంకట్రావు, రాజేశ్వరరావు, యాదవరెడ్డి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
వీరితోపాటు జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు జడ్పిటీసీలు, సర్పంచులు, ఇతర నాయకులు టిఆర్ఎస్లో చేరనున్నారు. కాగా, త్వరలోనే ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది.