కేసీఆర్తో మళ్లీ తలసాని, బెజవాడ సమీపంలో రాజధాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సనత్ నగర్ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం కలిశారు. కాగా, తలసాని శ్రీనివాస యాదవ్ తెరాసలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
విద్యుత్ పైన...
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని జెన్కో సీఎండీ ప్రభాకర రావు అన్నారు. జల విద్యుత్ ప్రారంభం కావడంతో విద్యుత్ కోతలు తగ్గాయని చెప్పారు. విద్యుత్ డిమాండు కంటే సప్లై ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో విద్యుత్ వినియోగం కంటే చాలా ఎక్కువగా సప్లై ఉందని తెలిపారు. తెలంగాణలో 120 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉందని, సప్లై మాత్రం 140 మిలియన్ యూనిట్లు ఉందని చెప్పారు.
విజయవాడ పరిసరాల్లోనే రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసరాల్లోనే ఉంటుందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం అన్నారు. రాజధాని కోసం భూసేకరణకు రైతులు సహకరిస్తారని ఆయన చెప్పారు.
మెగాసిటీగా తిరుపతి
తిరుపతిని మెగా సిటీగా మారుస్తామని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తిరుపతిలో మెట్రో రైలును నిర్మిస్తామన్నారు. టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. టూరిజం అభివృద్ధితో ఆదాయం, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏపీ టూరిజం అభివృద్ధికి కేంద్రం సాయం చేయాలని కోరారు.