తెలుసు, ఊహించలేదు: గెలుపుపై తంగిరాల సౌమ్య
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య మంగళవారం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తన విజయం పైన సౌమ్య స్పందించారు. తాను గెలుస్తానని తెలుసునని, మెజార్టీని మాత్రం ఊహించలేదని చెప్పారు. తనను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు అన్నారు.
నందిగామ శాసన సభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావు పైన 74,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
స్థానిక కేవీఆర్ కళాశాలలో మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. టీడీపీ అభ్యర్థి సౌమ్యకు 99,748, కాంగ్రెస్ అభ్యర్థికి 24,921, స్వతంత్ర అభ్యర్థులు పుల్లయ్య 941, పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. నోటాకు 1178 ఓట్లు పోలయ్యాయి. విజయం సాధించిన తంగిరాల సౌమ్యకు ఎన్నిక ధ్రవీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి రజనీకాంతా రావు అందజేశారు.