జగన్తో ఎలా కలుస్తాం: జవదేకర్, ఇరుప్రాంతాల్లో మోడీ
హైదరాబాద్: తమ ప్రత్యర్థి పార్టీలు వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలేనని, అలాంటప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీతో ఎలా కలుస్తామని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం అన్నారు. తాము ప్రత్యర్థి పార్టీలతో ఎలా కలుస్తామన్నారు.
ఓ లక్ష్యం కోసమే టిడిపి, బిజెపి మధ్య పొత్తు కుదిరిందన్నారు. సీమాంధ్ర, తెలంగాణ అభివృద్ధి తమ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెసును ఎట్టి పరిస్థితుల్లోను తాము అధికారంలోకి రానిచ్చేది లేదన్నారు. అలాగే జగన్ పార్టీతో కలిసే ప్రసక్తి లేదన్నారు. రెండు మూడు రోజులుగా తాము ఒకరి ఆలోచనలు మరొకరం పంచుకుంటున్నామని టిడిపిని ఉద్దేశించి చెప్పారు.
రెండు రాష్ట్రాల్లోను తాము అధిక సీట్లు గెలుస్తామన్నారు. త్వరలో తెలంగాణలో, సీమాంధ్రలో మోడీ పర్యటిస్తారని చెప్పారు. టిడిపితో చర్చలు పూర్తిగా ముగిశాయని చెప్పారు. పొత్తు కొనసాగుతుందన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవని చెప్పారు. కాంగ్రెసు పార్టీని తరిమి కొట్టాలన్నదే తమ లక్ష్యమన్నారు. సీట్ల సర్దుబాటులో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు సహజమని చెప్పారు.
టిడిపి, బిజెపి కలిసి వెళ్లాలని మొదటి నుండి అనుకుంటున్నామని టిడిపి నేత సుజనా చౌదరి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తమదే అధికారమన్నారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం సరైన విధానాలను రూపొందిస్తామని చెప్పారు.