యథాతథంగా!: పొత్తు చర్చలు సఫలం, కల్సి భోంచేశారు
హైదరాబాద్: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పొత్తుపై ఆ పార్టీల నేతల మధ్య చర్చలు సఫలమయ్యాయి. ఇరు పార్టీల నేతలు కలిసి శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. చంద్రబాబు నివాసంలో బిజెపి నేత ప్రకాశ్ జవదేకర్, ఆర్ఎస్ఎస్కు చెందిన రాజ్ పురోహిత్లు మూడు గంటలకు పైగా చర్చలు జరిపారు.
యథాతథంగా ఇరు ప్రాంతాల్లో టిడిపి, బిజెపిలు పోటీ చేయాలని వారు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, పలు ప్రాంతాల్లో బిజెపి బలహీన అభ్యర్థులను పోటీలో నిలిపిందనే వాదనల నేపథ్యంలో బిజెపి అభ్యర్థులను మార్చే అవకాశం లేకపోలేదంటున్నారు.
యథాతథంగా రెండు పార్టీలు పోటీ చేయనున్నారని చెబుతున్నప్పటికీ చిన్న చిన్న మార్పులకు కూడా అవకాశం లేకపోలేదంటున్నారు. బిజెపి నాలుగైదు అసెంబ్లీ సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇస్తే.. బిజెపికి టిడిపి ఒకటి లేదా రెండు లోకసభ స్థానాలు ఇచ్చే అవకాశముందంటున్నారు. ఇచ్ఛాపురం, తాడేపల్లి గూడెం స్థానాలు టిడిపికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
చర్చల అనంతరం చంద్రబాబు, జవదేకర్, రాజ్ పురోహిత్లు కలిసి భోజనం చేశారు. కాగా, చర్చలు ఫలవంతంగా ముగిశాయని ప్రకాశ్ జవదేకర్ అనంతరం చెప్పారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో టిడిపి - బిజెపి పొత్తు కొనసాగుతుందని చెప్పారు.