వైఎస్ పాలనతో జగన్ను కార్నర్ చేస్తున్న టిడిపి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయడానికి తెలుగుదేశం పార్టీ సభ్యులు పదే పదే వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలోని అంశాలను ముందుకు తెస్తున్నారు. జగన్ ఏ విషయాన్ని ప్రస్తావించినా వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
శాంతిభద్రతలపై చర్చకు పట్టుబడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శాసనసభా కార్యక్రమాలను స్తంభింపజేసినప్పుడు తెలుగుదేశం సభ్యులు వైయస్ పాలనలో జరిగిన రాజకీయ హత్యలను ప్రస్తావించారు. ప్రధానంగా పరిటాల రవి హత్య కేసును ముందుకు తెచ్చారు. ఆ రకంగా జగన్పై టిడిపి ఎదురుదాడికి దిగింది.
ప్రతి విషయంలోనూ అదే పద్ధతిని కొనసాగిస్తూ వైయస్ జగన్ను చిక్కుల్లో పడే ప్రయత్నాలను టిడిపి చేస్తోంది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి సభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు కూడా అదే వ్యూహాన్ని అనుసరిచారు. ఎన్నికల్లో పట్టుబడిన మద్యం, నమోదు చేసిన కేసులపై ఆయన మాట్లాడతూ వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావించారు.
దానికి జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. వైయస్సార్ చనిపోయి అయిదేళ్లవుతోందని, ఎన్నికలు జరిగి మూడు నెలలు అవుతోందని, ఈ మూడు నెలల్లో జరిగినవి కూడా వైయస్సార్కే అపాదించడం టిడిపికే చెల్లుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరిగిన రాజకీయ హత్యల విషయంలో కూడా జగన్ మూడు నెలల కాలంలో జరిగినవాటిపై చర్చ జరగాలని అన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ 2009 నుంచి జరిగిన హత్యలపై చర్చ చేద్దామని చెప్పింది.
టిడిపి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై చేస్తున్న విమర్శలకు జగన్ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. పరలోకంలో ఉన్న తన తడ్రి వైయస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్నీ చూస్తున్నారని జగన్ అన్నారు. మరణించి ఐదేళ్లు అవుతున్నా ప్రతి విషయాన్నీ వైయస్సార్కే ఆపాదించడం టిడిపి మామూలైపోయిందని ఆయన అన్నారు.
మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. అధికార తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు దాడి, ఎదురుదాడులతో సమావేశాలను వేడెక్కిస్తున్నాయి.