కేసీఆర్లో వైయస్ ఆత్మ: 'బాబు కబ్జా'పై ధీటుగా టీడీపీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన కర్నె ప్రభాకర్ భూముల ఆక్రమణ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ ధీటుగా స్పందించింది. వైయస్ ఆత్మ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులో ప్రవేశించినట్లుగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి వేం నరేందర్ రెడ్డి శనివారం అన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో, కేంద్రంలో రెండేళ్ల పాటు భాగస్వామిగా ఉన్న తెరాస పార్టీకే కాంగ్రెస్ అవినీతి బురద అంటుతుందన్నారు.
తెలుగుదేశం పార్టీపై, నాయకులపై టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై ఒకసారి ఆలోచించుకుంటే దోపిడీ వ్యవస్థ ఎవరిదనేది తెలుస్తుందన్నారు. 2004 నుంచి 2014 మార్చి వరకు కాంగ్రెస్ పాలనలో దోపిడీ జరిగింది తెలియనిదెవరికన్నారు. అవినీతిని నిర్మూలిస్తామంటున్నవారే కాంగ్రెస్ భాగస్వాములన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరేళ్లు కష్టపడి చంద్రబాబుపై న్యాయ విచారణలు, హౌజ్కమిటీలు వేసినా అవినీతి మరకను చూపించలేకపోయారన్నారు.
వైయస్ ఆత్మ కేసీఆర్లో ప్రవేశించినట్టుందన్నారు. తనతో పాటు తన మనుషుల చేత మాట్లాడించే మాటలతో తెలంగాణలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, హామీల అమలుకు ఎంత వ్యయమవుతుందో తెలుపుతూ ప్రజల ముందు శ్వేతపత్రం పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకు విచారణలతో కాలయాపన చేయవద్దన్నారు.
మళ్లీ దళితుల వంచనకు సిద్ధమౌతున్నారు: నన్నూరి
దళితుడ్ని సీఎంను చేస్తానని చెప్పి కేసీఆర్ వంచించారని, భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తానని ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాన్ని కూడా దళితులను వంచించడానికి సిద్ధం అవుతున్నారని నన్నూరి నర్సిరెడ్డి విమర్శించారు. మభ్యపెట్టడం, రెచ్చగొట్టడం, వంచించడంలో తనకు తానే టార్గెట్గా చేసుకోవడం కేసీఆర్ నైజమన్నారు. కెసిఆర్ వంచన క్రీడకు దళితుల జీవితం మైదానంగా మారిందన్నారు.