జయ: జగన్ని టార్గెట్ చేశారు, తప్పించుకోలేరని..!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా జైలుకు పోక తప్పదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆదివారం అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించేవారు ఎవరైనా సరే చట్టం ముందు తల వంచక తప్పదన్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకున్న జగన్కు తన భవిష్యత్ ఏమిటో నిన్న జయలలితకు పడిన శిక్షతో అర్థమయి ఉంటుందన్నారు.
జయపై కేవలం ఒక ఛార్జ్ షీట్ మాత్రమే దాఖలయిందని, జగన్ పై 11 ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయన్నారు. అన్నిట్లో జగన్ ఏ1గా ఉన్నారన్నారు. ఒక ముఖ్యమంత్రి కుమారుడిపై 11 కేసులు నమోదవడం దేశ చరిత్రలోనే లేదన్నారు. ఇన్ని కేసుల్లో నిందితుడైన జగన్ తప్పించుకునే పరిస్థితే లేదని, జైలుకు పోకతప్పదన్నారు.
అవినీతికి పాల్పడితే జైలుకు పోకతప్పదని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. అక్రమాస్తుల కేసులో జయలలితకు కోర్టు విధించిన శిక్షను తాను స్వాగతిస్తున్నానని, చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ విచారణలో దోషిగా తేలడం ఖాయమన్నారు.
రూ.66 కోట్ల అవినీతికి పాల్పడిన జయకు కోర్టు కఠిన శిక్షను విధించిందని, జగన్ కేసులో ఇప్పటికే రూ.850 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, సీబీఐ పిటిషన్లలో జగన్ వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారని ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో, జగన్కు పడబోయే శిక్ష ఇంకెంత కఠినంగా ఉంటుందో అన్నారు.