తిరగబడిన వ్యూహం: జగన్పై టిడిపి ఎదురుదాడి
హైదరాబాద్: హత్యారాజకీయాలపై శాసనసభలో చర్చకు తెచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహం బెడిసికొట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నాయకులు అసెంబ్లీ లోపలా, బయటా తెంపు లేకుండా జగన్పై, ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు.
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రౌడీ, సైకోలా వ్యవహరిస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలని ఆయన సూచించారు. సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని ఆయన శనివారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియాపై ఉక్కుపాదం మోపారని తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు శ్రవణ్కుమార్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిభద్రతలపై చర్చించే అవసరమేలేదని ఆయన శనివారంనాడు శాసనసభలో తెలిపారు. తన స్నేహితులెవరో జగన్ చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ మానవత్వం లేని వ్యక్తి అని, ఆయకు శాంతిభద్రతలపై మాట్లాడే అర్హత లేదని శ్రవణ్కుమార్ అన్నారు.
జగన్ దగ్గరకు వెళ్తే కొడతారేమో అనే భయం కలుగుతోందని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. శాంతిభద్రతలపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ - జగన్ నిస్పృహలో ఉన్నట్లు కన్పిస్తున్నారని అంటూ ఆయన్ని 15 రోజులు సెలవుపై పంపించండని స్పీకర్ను కోరారు. జగన్ ఆస్పత్రిలో చూయించుకుంటే మంచిదని ఎమ్మెల్యే అన్నారు. శాంతిభద్రతలపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చూస్తున్నారని విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో రౌడీలా వ్యవహరిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి తప్పుబట్టారు. జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడేందుకు అసెంబ్లీ ఇడుపులపాయ, లోటస్పాండ్ కాదన్నారు. శాసనసభ చట్టం ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు.
తమపై అనుచిత వ్యాఖ్యలు చేసి క్షమాపణ చెప్పకపోయినా ఆయన విజ్ఞతకే వదిలేశామని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అద్దంముందు నిలబడి హావభావాల్ని చూసుకుంటే ఎలా ప్రవర్తిస్తున్నాడో జగన్కే అర్థమవుతుందని హితవు చేశారు. జగన్ నాయక త్వంలో తమరు ఉంటే భవిష్యత్లో నిందితులుగా తయారవుతారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
జగన్ తీరును స్పీకర్ కోడెల శివప్రసాద రావు కూడా తప్పు పట్టారు. మంత్రి యనమల రామకృష్ణుడు కూడా జగన్ తీరును శాసనసభలో శనివారం తీవ్రంగా విమర్శించారు. తెలుగుదేశం సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
అయితే, శాసనసభలో స్పీకర్ కోడెల శివప్రసాద రావు అధికార పక్షానికి తోడ్పడుతూ తనపై దాడికి సహకరిస్తున్నారని జగన్ అభిప్రాయపడుతున్నారు. స్పీకర్పై జగన్, వైసిపి శాసనసభ్యులు తీవ్రంగానే విమర్శలు చేస్తున్నారు.