బాలికపై టీచర్ అత్యాచారం: కన్నకూతురిపై దారుణం
ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పరమర నాయుడు పాలెంలో 14 ఏళ్ల బాలిక బంధువుల ఇంటికి వెళ్లి గురువారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా కరెంట్ పోయింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న షేక్ కాలేషావలి (30) బాలికను బలవంతంగా పాఠశాలలోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు.
బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి విషయాన్ని చెప్పడంతో బాలిక బంధువులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరో ఘటనలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో పది రోజుల కిందట ఇంట్లో కూతురు ఒంటరిగా ఉన్న సమయంలో మద్యానికి బానిసైన తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు (16) జగ్గయ్యపేటలో ఉన్న బాబాయికి విషయం చెప్పడంతో అతను వచ్చి నిందితుడికి దేహశుద్ధి చేశాడు.
మళ్లీ నాలుగు రోజుల కిందట అఘాయిత్యానికి పాల్పడడంతో బాధితురాలు మేనత్త ఇంటికి చేరుకుని విలపించింది. నిందితుడు తన కూతురును ఇంటికి పంపించాలని రెండు రోజులుగా ఆ ఇంటి తిరుగుతుండడంతో బాధితురాలు బాబాయి ఇంటికి వెళ్లింది. ఆయన శుక్రవారం చిల్లకల్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.