అభివృద్ధే లక్ష్యం: కిషన్, టి బిజెపి మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తన మేనిఫెస్టోను విడుదల చేసింది. శుక్రవారం బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. బడుగు బలహీన, వెనకబడిన వర్గాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బిజెపిది కీలక పాత్ర అని అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు.
జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా, అక్టోబర్ 19ని గిరిజన సాధికారత దినంగా ప్రకటిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పేరును కొమురం భీం జిల్లాగా మార్చుతామని చెప్పారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, 3 ఎకరాల భూమిని అంందజేయనున్నట్లు తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారు. రైతులకు 9గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బాధ్యతాయుతంగా పని చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశాభివృద్ధి బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు దత్తాత్రేయ, వి. రామారావు పాల్గొన్నారు.