రుణ మాఫీపై రైతులను తికమక పెట్టం: కేసీఆర్
హైదరాబాద్: మంగళవారం సచివాలయంలో బ్యాంకర్లతో పంట రుణ మాఫీపై సమీక్షా సమావేశం నిర్వహించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రైతులను తికమక పెట్టకుండా, గందరగోళానికి గురి చేయకుండా పంట రుణ మాఫీ పథకాన్ని అమలు చేయాలని అన్నారు.
పంట రుణ మాఫీకి సంబంధించిన విధి విధానాలను ఇందులో చర్చించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమది ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వమని, ప్రజలకు మేలు చేయడానికే తప్ప వ్యతిరేకంగా పనిచేసే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరక లక్ష రూపాయల వరకు పంట రుణ మాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో బ్యాంకులు అనేక షరతులు పెడుతున్నాయని, వాటన్నింటిపై కూడా తాన ఆర్బీఐ గవర్నర్ రఘునాధ్ రామన్తో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
తమ వద్ద రుణ మాఫీకి సంబంధించి ప్రాధమికంగా రెండు ప్రతిపాదనలు ఉన్నట్లు కూడా ముఖ్యమంత్రి చెప్పారు. రుణ మాఫీకి సంబంధించిన సొమ్మును బ్యాంకర్లకు విడతల వారీగా చెల్లిస్తామని, బ్యాంకర్లు రైతులకు కొత్తగా రుణాలివ్వాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.
రైతులకు బాండ్లు ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. రైతులకు రుణ మాఫీ చేయడం నూటికి నూరు శాతం ఖచ్చితంగా జరుగుతుందని, ఐతే ఏ పద్దతిలో రుణ మాఫీ చేయాలన్నదే తేలాలన్నారు. పంట రుణ మాఫీకి సంబంధించి విధి విధానాలను రూపొందించడానికి ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం సంబంధిత అధికారులతో మంగళవారం సమావేశం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నందున మరో మంత్రి హరీష్ రావు నేతృత్వంలో అధికారులతో పాటు బ్యాంకర్లు కూడా సమావేశంలో పాల్గోని విధి విధానాలపై చర్చించాలని కోరారు. నాలుగైదు రోజుల్లోనే రుణ మాఫీ విధి విధానాలను ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు.