నరేంద్ర మోడీ రూట్లో: సోషల్ మీడియాపై కేసీఆర్ కన్ను
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సామాజిక వెబ్సైట్ల పైన దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు సామాజిక వెబ్సైట్లను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ సీఎం కార్యాలయం సామాజిక వెబ్సైట్లో కనిపించనుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళి, వారి ఆదరణను మరింత పొందాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆలోచనతోనే 'సీఎంఓ తెలంగాణ' పేరుతో ట్విట్టర్, ఫేస్బుక్లలో ఖాతాలు తెరిచారు.
ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాలు, వివిధ శాఖల్లో చేపడుతున్న కార్యక్రమాల గురించి ఫేస్బుక్ ఖాతాలో ఎప్పటికప్పుడు కచ్చితంగా పొందుపరచడం ద్వారా వాటికి విస్తృతంగా ప్రచారం కల్పించాలని కేసీఆర్ సీఎంవో అధికారులను ఆదేశించారు. ఇలా చేయడం ద్వారా వాటిపై ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
కేసీఆర్ నిర్ణయం మేరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో ఓ వెబ్సైట్ను రూపొందించే పనిలో పడింది. త్వరలోనే ట్విట్టర్, ఫేస్ బుక్, వెబ్సైట్లను ఒకేసారి అధికారికంగా ప్రారంభించాలని తెలంగాణ సీఎంఓ అధికారులు భావిస్తున్నారు. ప్రతి శాసన సభ నియోజకవర్గ పరిధిలో 30 శాతం మంది యువత వివిద రూపాల్లో సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తోంది. ఈ కారణంగా వీటి ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకు వెళ్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.