నీటి గొడవ: ఏపీకి తెలంగాణ లేఖ, కాశ్మీర్పై వెంకయ్య..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాసింది. పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వపై తెలంగాణ ప్రభుత్వం తన లేఖలో అభ్యంతరం తెలిపింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, నీటిని ఎలా నిల్వ చేస్తారని ప్రశ్నించింది. అక్కడున్న గ్రామవాసులకు పునరావాసం కల్పించిన తరువాతే నీటిని నిల్వ చేసుకోవాలని కోరింది.
కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని నిరూపిస్తాం: వెంకయ్య
కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని నిరూపిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడమే బీజేపీ విధానమన్నారు. మావోయిస్టులు తుపాకీ తూటాలతో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేరనే విషయం గుర్తించాలన్నారు.
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి పార్టీల కార్యకర్తలు వారధిలా ఉండాలన్నారు. బీజేపీని ఏపీలో దృఢం చేయాలంటే కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలన్నారు. మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం వంద రోజుల పాలనలో వంద అడుగులు ముందుకేసిందన్నారు.
వాజపేయి హయాంలో 8.4 శాతం ఉన్న వృద్ధిరేటును యూపీఏ ప్రభుత్వం 4.6 శాతానికి దిగజార్చిందని, ఈ మూడు నెలల కాలంలో వృద్ధిరేటు 5.7 శాతానికి పెరిగిందన్నారు. రానున్న కాలంలో దీనిని తొమ్మిది శాతానికి పెంచే దిశలో పని చేస్తామన్నారు. మోడీ ప్రభుత్వం పాలనను చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.