ముడుపులు: బాధించిందని రేవంత్ రెడ్డిపై నిప్పులు
హైదరాబాద్: ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్ల ఫీజులను పెంచి యాజమాన్యాలు దోచుకుతినేందుకు కేసీఆర్ సర్కారు ఆస్కారమిస్తోందన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన తెరాస ఎంపీ బూర నర్సయ్య గౌడ్, తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ రావు మండిపడ్డారు.
ఏపీలో వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో ఎన్ఆర్ఐ కోటా సీట్లు 15 శాతం కేటాయించి, ఫీజు రూ.12 లక్షలకు పెంచుతూ జీవో ఇచ్చిన ఏపీ సర్కార్, ఏ మేరకు ముడుపులు తీసుకుందో చెప్పాలని, ఎవరు దోచుకుంటున్నారో గమనించాలని అన్నారు. ఏఎఫ్ఆర్సీ నిబంధనల మేరకే ఫీజులను పెంచినట్లు తెలిపారు.
మెడికల్ కళాశాలల ఏర్పాటుకు వందల కోట్లు అవసరమని, దీనికి అవసరమయ్యే ఖర్చు యాజమాన్యాల పైన పడకుండా ఉండాలంటే ఈ మేరకు కోటా ఫీజు పెంచాల్సి ఉందన్నారు. యాజమాన్య కోటా సీట్ల ఫీజుల పెంపు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి ముడుపులు ఇచ్చామనే ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని అసోసియేషన్ ఖండించింది.
యాజమాన్య కోటా సీట్ల ఫీజుల పెంపుకోసం రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చామని రేవంత్ రెడ్డి నింద వేశారని, చాలా బాధ కలిగిందన్నారు. దీనిపై సరైన అవగాహనతో మాట్లాడితే బాగుంటుందన్నారు. గత ప్రభుత్వాల మాటకు తలొగ్గి కొన్నేళ్లుగా ఫీజులు పెంచకపోయినా ఊరుకున్నామని, ఈ ఏడాది ఫీజుల పెంపుపై తాము తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగానే అడిగామన్నారు.