దాదాగిరి, కుట్రలు చేస్తున్నారు: చంద్రబాబుపై హరీశ్ ఫైర్
హైదరాబాద్/నల్గొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఫీజులు చెల్లిస్తుందని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని అన్నారు.
తెలంగాణ ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టాలని ఏపి సిఎం చంద్రబాబునాయుడు చూస్తున్నారన్నారు. ఫీజు చెల్లింపుల విషయంలో చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ విద్యార్థులకు నష్టం జరిగేవిధంగా చంద్రబాబు నాయుడు దాదాగిరి చేస్తున్నారని విమర్శించారు. ఏ రాష్ట్ర విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి కానీ, పక్క రాష్ట్ర విద్యార్థులకు సాయం చేయాలని చంద్రబాబు అడగటం కుట్ర పూరితమేనని అన్నారు. సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరిగింది.. ఇప్పుడు సవరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. దీన్ని కూడా చంద్రబాబు ఇప్పుడు అడ్డుకుంటున్నారని రోపించారు.
విద్యార్థులకు ఏదో నష్టం జరుగుతోందని చెబుతున్నారని అన్నారు. గతంలోనూ ఎంసెట్ ప్రవేశాలు ఆగస్టు చివర్లోనే జరిగేవని, కొంప మునిగినట్లు ఇప్పుడే గోల చేస్తున్నారని, డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానికత నిర్ధారించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని సుప్రీం కూడా చెప్పిందని అన్నారు. తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనేదే తమ ప్రయత్నమని హరీశ్ రావు చెప్పారు.
ఏపి కౌన్సిలింగ్తో సంబంధం లేదు: కెటిఆర్
నల్గొండ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సిలింగ్తో తమకు సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఆయన నల్గొండలో పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఏపి ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు, అయోమయానికి గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తుందని కెటిఆర్ చెప్పారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేస్తామని అన్నారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలను కంప్యూటీకరిస్తామని చెప్పారు.