ముగిసిన కేబినెట్, తెలంగాణ నోట్కు ఆమోదం
న్యూఢిల్లీ: అనూహ్యంగా తెలంగాణ నోట్ గురువారం సాయంత్రం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా నోట్ వచ్చింది. సమావేశానికి ముందు నోట్పై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేశారు. దానికి యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ పచ్చజెండా ఊపారు. ఎజెండాలో తెలంగాణ అంశం లేనప్పటికీ టేబుల్ ఐటమ్గా దాన్ని మంత్రివర్గం ముందు ప్రతిపాదించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్ను ఆమోదించినట్లు తెలుస్తోంది. పది రోజుల్లోగా అభిప్రాయం కోసం శాసనసభకు పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈలోగా మంత్రుల గ్రూపును తెలంగాణపై ఏర్పాటు చేస్తారు.
- సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమైన మంత్రి వర్గ సమావేశం ఏడు గంటల ప్రాంతంలో ముగిసింది. తెలంగాణపై నోట్ను కావూరి సాంబశివరావు, పళ్లం రాజు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
- కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్పై చర్చిస్తున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. దీంతో హైదరాబాదులో డిజిపి ప్రసాదరావు జిల్లాల ఎస్పీలతో, ఐజిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
- ప్రధాని నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన సీమాంధ్ర విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీమాంధ్ర విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ సంఘీభావం తెలిపారు. విద్యార్థుల అరెస్టును మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఖండించారు.
- మంత్రివర్గం సమావేశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేబినెట్ సమావేశంలో తెలంగాణ నోట్పై ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొని ఉంది.
- మంత్రి వర్గ సమావేశానికి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివ రావు, పళ్లంరాజు, ఎస్ జైపాల్ రెడ్డి హాజరయ్యారు. వీరిలో మొదటి ఇద్దరు సీమాంధ్రకు చెందినవారు కాగా, జైపాల్ రెడ్డి తెలంగాణకు చెందినవారు.
- మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడానికి ఇప్పటికే కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రధాని నివాసానికి చేరుకున్నారు.
- కేంద్ర మంత్రుల కాన్వాయ్ను అడ్డుకోవడానికి సమైక్యాంధ్ర విద్యార్థులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
- కావూరి సాంబశివ రావు మంత్రి వర్గ సమావేశంలో పాల్గొనడానికి ప్రధాని నివాసంలోకి వచ్చారు.
- తెలంగాణపై కేబినెట్ నోట్ ప్రతులను మంత్రులకు అందజేశారు.
- ఢిల్లీలో సీమాంధ్ర విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రధాని నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
- మాతృవియోగం కారణంగా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు.
- తెలంగాణ నోట్ మంత్రివర్గం ముందుకు వస్తుందని తెలిసిన తర్వాత సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని కలిశారు. రాష్ట్ర విభజన నిర్ణయం కాంగ్రెసు పార్టీకి తీరని నష్టం చేస్తుందని కావూరి అన్నారు.