ఛత్తీస్గడ్ నుంచి విద్యుత్తు: కెసిఆర్ బ్యాకప్ ప్లాన్
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్తు కొరతను అధిగమించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బ్యాకప్ ప్లాన్ తయారు చేశారు. పొరుగున ఉన్న ఛత్తీస్గడ్ రాష్ట్రం నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేయాలని ఆయన నిర్ణయించారు. విద్యుత్తు సంక్షోభాన్ని నివారించడానికి ఛత్తీస్గడ్తో స్వల్పకాలిక ఒప్పందాలు మాత్రమే కాకుండా దీర్ఘకాలిక ఒప్పందాలు కూడా చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు.
రాష్ట్రంలో విద్యుత్త కొరతపై, దానికి సంబంధించి విషయాలపై కెసిఆర్ శుక్రవారంనాడు ట్రాన్స్కో, సిఎంఓ అధికారులతో చర్చలు జరిపారు. ఛత్తీస్గడ్ నుంచి వెంటనే విద్యుత్తు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ట్రాన్స్కో మేనేజింగ్ డైరెక్టర్ రిజ్వీని ఆదేశించారు. విద్యుత్తు చాలా అందుబాటులో ఉన్నందున, లైన్లు వేయడం సులభమైనందున ఛత్తీస్గడ్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాలని అవసరం ఉందని కెసిఆర్ సూచించారు.
ఛత్తీస్గడ్ రాష్ట్ర విద్యుచ్ఛక్తి పంపిణీ సంస్థతో అవగాహన కుదుర్చుకోవాలని, భారత పవర్ గ్రిడ్ కార్పోరేషన్ లిమిటెడ్ (పిజిసిఎల్) తో లైన్స్ కోసం పిపిఎలు చేసుకోవడం ద్వారా వేయి మెగావాట్ల విద్యుత్తును తీసుకోవడానికి చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
లైన్లను వేయడానికి టెండర్లను ఆహ్వానించాలని కూడా ఆయన ఆదేశించారు. మధ్యకాలిక ప్రాతిపదికపై ఐదేళ్ల కాలానికి 2 వేల మెగావాట్లు ఇచ్చే విధంగా ఛత్తీస్గడ్తో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ విషయంపై ఛత్తీస్గడ్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ పని జరిగేలా చూడాలని కెసిఆర్ ట్రాన్స్కో ఎండికి సూచించారు.
ఛత్తీస్గడ్లో అపారమైన విద్యుత్తు మిగులు ఉందని, తెలంగాణకు ఆ రాష్ట్రం నుంచి మాత్రమే సమస్యలు లేకుండా విద్యుత్తును పొందడానికి వీలువుతుందని కెసిఆర్ భావిస్తున్నారు. అవసరమైతే ఛత్తీస్గడ్ వెళ్లి విద్యుత్తు కొనుగోలు కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించాలని కెసిఆర్ భావిస్తున్నారు.