50 మీ. దూరమే, సెకన్లలోనే: రైలు డ్రైవర్ (పిక్చర్స్)
హైదరాబాద్: తనకు కనిపించేసరికి పాఠశాల బస్సు కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉందని సికింద్రాబాద్ - నాందేడ్ ప్యాసెంజర్ రైలు డ్రైవర్ కెఎంవి సత్యనారాయణ అన్నారు. కాకతీయ పాఠశాల బస్సును రైలు ఢీకొనడంతో 16 మంది విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. ఆ సంఘటనపై రైలు డ్రైవర్ సత్యనారాయణ మాట్లాడారు.
బస్సు కనిపించగానే తాను ఎమర్జెన్సీ బ్రేకులు వేశానని ఆయన చెప్పారు. రైలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో రైలు నడుస్తోందని, సెకన్ల వ్యవధిలోనే రైలు బస్సును ఢీకొట్టిందని ఆయన చెప్పారు. డ్రైవర్ అటెండెంట్ ఆ సంఘటనతో స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అతనిపై స్థానికులు దాడి చేశారు.
వారిద్దరు ప్రస్తుతం గట్టి భద్రత మధ్య లాలాగుడా రైల్వే ఆస్పత్రి ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఎమర్జెన్సీ బ్రేకులు వేస్తే కొన్ని సార్లు రైలు పట్టాలు తప్పి భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందని, ఢీకొట్టడానికి కొన్ని సెకన్ల ముందే తాను బస్సును చూశానని ఆయన చెప్పారు.
తాను సైరన్ ఇచ్చినట్లు చెప్పారు. అయినా బస్సు క్రాస్ చేయడానికి ముందుకు వచ్చిందని అన్నారు. తాను ఎమర్జెన్సీ బ్రేకులు వేసినప్పటికీ రైలు ఆగలేదని, ఎమర్జెన్సీ బ్రేకులు వేసినప్పుడు రైలు ఆగడానికి కనీసం 400 మీటర్ల దూరం అవసరమని, బస్సు కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉందని చెప్పారు. దాంతో తాను స్పృహ తప్పానని చెప్పారు. ఏం జరిగిందో కూడా తనకు తెలియలేదని ఆయన చెప్పారు. తనపై, తన అటెండెంట్పై స్థానికులు దాడి చేశారని ఆయన చెప్పారు.
తనకు బస్సు కనిపించలేదని, తాను కూర్చున్న చోటు నుంచి బస్సు కనిపించే అవకాశం లేదని రైలు అసిస్టెంట్ కోటేశ్వర రావు చెప్పారు. స్థానికులు రాళ్లతో కొట్టడంతో అతను గాయపడ్డాడు.