బాబుకు తలనొప్పి: రేవంత్ రెడ్డి వర్సెస్ ఎర్రబెల్లి
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు వ్యవహారం తెలుగుదేశం తెలంగాణ నాయకుల మధ్య చిచ్చు పెట్టింది. ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారింది. మెట్రో రైలు వ్యవహారంలో తెలంగాణ టిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు సృష్టించినట్లు చెబుతున్నారు.
మెట్రో రైలు వ్యవహారంలో చంద్రబాబు సమక్షంలోనే వారిరువురు తలపడినట్లు చెబుతున్నారు. వారిద్దరి మధ్య విభేదాలు చంద్రబాబు వద్దనే బయటపడినట్లు చెబుతున్నారు. తెలంగాణలో సీనియర్ నేత అయిన తనకు తెలియకుండా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ మెట్రో రైలు భూబదలాయింపుపై రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మైహోం అధినేత రామేశ్వర రావుకు కెసిఆర్ ప్రభుత్వం మెట్రో రైలు భూమికి కేటాయించాల్సిన భూమిని బదలాయించిందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించడాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి వ్యవహారం విషయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిసినట్లు చెబుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీలో ఉంటారా, లేదా అనేది కూడా అనుమానంగా మారిందని ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డికి చంద్రబాబు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నాయకుల వద్ద కూడా చంద్రబాబు రేవంత్ రెడ్డిని ప్రశంసించినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కొనసాగడం తనకు ఇబ్బందిగానే ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నట్లు తెలుస్తోంది.