సరి చేస్తున్నాం: టీ చిహ్నంలో లోపాలపై కోర్టుకి ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ రాజముద్రను రూపొందించడంలో దొర్లిన లోపాన్ని సరిదిద్దడానికి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సోమవారం తెలిపింది. తెలంగాణ రాజముద్రలో డిజైన్లో లోపాలు ఉన్నాయని హైకోర్టులో దాఖలైన పిటీషన్పై ప్రభుత్వం సోమవారం బదులిస్తూ.. రాజముద్రలో లోపాలు సరిచేస్తామని పేర్కొంది.
లోపాలు సరిచేసే చర్యలు చేపట్టామని ప్రభుత్వం హైకోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికారిక చిహ్నం రూపొందించడంలో నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ హైదరాబాదుకు చెందిన హక్కుల కార్యకర్త పి ధనగోపాల్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ధనగోపాల్ వాదనలు వినిపిస్తూ.. రాజముద్రలో మూడు సింహాల కింద దేవనాగరి లిపిలో ఉండాల్సిన సత్యమేవ జయతే అనే పదాలను మూడు సింహాలకు దూరంగా జరిపారన్నారు. ఈ విధానం స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా చట్టానికి విరుద్ధమన్నారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ... ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
జీవో-9పై పిల్ కొట్టివేత
జీవో-9పై దాఖలైన ప్రజావాజ్య పిటీషన్ (పిల్)ను హైకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011 జూన్ 1 నుండి 2020 మే 31వ తేదీ వరకూ 10 ఏళ్లపాటు బిసిలకు రిజర్వేషన్లను కొనసాగిస్తూ ఇచ్చిన జీవో 9పై నగరానికి చెందిన సి సాయి విష్ణువర్ధన్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్త , జస్టిస్ పివి సంజయ్కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ పిటీషన్ను విచారణకు చేపట్టేందుకు తిరస్కరించింది. కాగా మరోపిటీషన్లో జాంపేటలో కబేళాపై వెంటనే చర్యలు చేపట్టాలని హైకోర్టు మున్సిపల్ కార్పొరేషన్ను ఆదేశించింది.