పోస్టర్స్ చించి, దగ్ధం: జూ ఎన్టీఆర్ 'రామయ్య..'కు టి సెగ
మహబూబ్నగర్: ఎన్టీఆర్, సమంత జంటగా నటించిన, హరీష్ శంకర్ దర్వకత్వంలో వచ్చిన రామయ్యా వస్తావయ్య చిత్రానికి తెలంగాణ సెగ తగులుతోంది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు రామయ్యా వస్తావయ్య చిత్రాన్ని అడ్డుకున్నారు. సినిమా పోస్టర్లను చించి, దగ్ధం చేశారు. దీంతో సినిమా ప్రదర్శనకు అడ్డంకి ఏర్పడింది.
జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి హరికృష్ణ సమైక్యాంధ్ర కోసం కొద్ది రోజుల క్రితం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సమైక్యాంధ్రకు మద్దతుగా హరికృష్ణ రాజీనామా చేసిన వెంటనే తెలంగాణవాదులు జూనియర్ సినిమాలను అడ్డుకుంటామని ప్రకటనలు చేశారు.
ఇటీవల వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రానికి కూడా విభజన సెగ తగిలిన విషయం తెలిసిందే. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తెలంగాణకు మద్దతు తెలపడం లేదంటూ తెలంగాణవాదులు, సమైక్యాంధ్రకు అనుకూలంగా రాజీనామా చేయడం లేదంటూ సమైక్యవాదులు పవన్ అత్తారింటికి దారేది చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. హరికృష్ణ సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయడంతో ఇప్పుడు ఎన్టీఆర్ చిత్రానికి తెలంగాణలో సెగ తగులుతోంది.
కాగా, ఎన్టీఆర్, సమంత జంటగా నటించిన చిత్రం 'రామయ్యా వస్తావయ్యా ' ఈ రోజే(శుక్రవారం) విడుదల గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రింట్స్తో విడుదల అయింది. శ్రుతి హాసన్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత హరీష్ డైరక్ట్ చేస్తున్న చిత్రం కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి తమన్ అందించిన పాటలు, కట్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై పెట్టుకొన్న ఆశల్ని రెట్టింపు చేశాయి.