టిడిపి, జగన్ పార్టీ నేతల ఘర్షణ: రోజాకు గాయం
చిత్తూరు: జిల్లాలోని నగరిలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. నగరిలో అమ్మవారి జాతర సందర్భంగా ఈ గొడవ చోటుచేసుకుంది. చివరి రోజు ప్రోటోకాల్ ప్రకారం దేవతలకు స్థానిక ఎమ్మెల్యే ప్రధాన హారతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
కాగా, ఇందుకు పలువురు టిడిపి నేతలు ఆమెను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. జాతర పెద్ద కుమరేశన్ మొదలియార్ ప్రధాన హారతి ఇవ్వకూడదని ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్నారు.
దీంతో టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో రోజా చేతిలోని హారళ్లెంను మరోవర్గం వారు లాగేయడంతో రోజా చేతికి తీవ్ర గాయమైంది. దీంతో అక్కడ ఉద్రక్తత వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న నేతలకు పోలీసులు కూడా సహకరించడం బాధాకరమని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.