పవన్, కిరణ్ రెడ్డి పార్టీలకు ఆదరణ ఉండదు: మేకపాటి
నెల్లూరు/హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ సహా ఎవరు రాజకీయ పార్టీలు పెట్టినా ప్రజలు ఆదరించరని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల్లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని మేకపాటి రాజమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
విభజన అడ్డుకోని కిరణ్ మాపై విమర్శలా: కొణతాల
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి కొనసాగుతున్న సమయంలో తన పదవికి రాజీనామా చేసివుంటే రాష్ట్ర విభజన ఆగిపోయి ఉండేదని, అలా చేయకుండా చివరి బంతి వరకు అదిగో కొడతా, ఇదిగో కొడతా అని చేతులెత్తేశారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ తీవ్ర యిలో మండిపడ్డారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల గురించి పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లాల కన్వీనర్లతో జరిగిన విస్త్రృత స్థాయి సమావేశం అనంతరం కొణతాల మీడియాతో మాట్లాడారు. విభజనపై కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే సుప్రీం కోర్టులో కేసు వేయలేదని అన్నారు. చాలా మంది కేసు వేశారని, వాటన్నిటినీ కలిపే సుప్రీం విచారిస్తోందని, ఇందులో కిరణ్ కుమార్ రెడ్డి గొప్పతనమేమి లేదని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉందని కొణతాల రామకృష్ణ చెప్పారు.
ఇప్పటి వరకు పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కొణతాల అన్నారు. అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. పార్టీ తరపు ఎన్నికల ప్రచారంలో గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, పార్టీ నేత షర్మిలలు పాల్గొంటారని కొణతాల చెప్పారు. నల్గొండలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న ఓదార్పు యాత్రకు అనుమతి రావాల్సి ఉందని తెలిపారు.