ఆ ముగ్గురు మంత్రులు టిడిపిలోకి, ఎమ్మెల్యేలు కూడా
హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు గంటా శ్రీనివాస రావు, టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు త్వరలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. రెండుమూడు రోజుల్లో వారు టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఒకటి రెండు రోజుల్లో చర్చలు కొలిక్కి వచ్చాక వారు అధికారికంగా ప్రకటన చేసే అవకాశముంది. వీరితో పాటు పలువురు శాసన సభ్యులు కూడా సైకిల్ ఎక్కనున్నారు.
టిజి, ఏరాసులు కర్నూలు జిల్లాకు చెందిన వారు కాగా, గంటా విశాఖకు చెందినవారు. ఈ ముగ్గురితోపాటు కర్నూలు జిల్లాకు చెందిన సిటింగ్ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి కూడా సోమవారమే తన చేరికను ప్రకటించే అవకాశముంది. వీరిలో ముగ్గురు మంత్రులకూ గతంలో టిడిపితో అనుబంధం ఉంది. టిజి, గంటా గతంలో టిడిపి టికెట్ఫై గెలుపొందగా, ఏరాసు తండ్రి అయ్యపు రెడ్డి గతంలో టిడిపి ఎంపీగా పనిచేశారు.
ఇటీవలి రాజకీయ పరిణామాల్లో వీరందరూ టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరిని రాజకీయంగా తనతోపాటు తీసుకెళ్లేందుకు కిరణ్ గట్టి ప్రయత్నం చేసినా సాధ్యపడ లేదు. తమ తమ ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాత టిడిపిలోచేరడమే మంచిదని వీరంతా నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. వీరి చేరిక సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగా పరిణమిస్తుందని, అదే సమయంలో టిడిపిలో మరిన్ని చేరికలకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
మంత్రులు ముగ్గురూ భవిష్యత్తులో రాజకీయంగా తమకు లభించాల్సిన ప్రాధాన్యంపై చంద్రబాబుతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో టిజి కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తుండగా, ఏరాసు పాణ్యం అసెంబ్లీ సీటుకు మారే అవకాశముంది. గంటా విశాఖ లోక్సభ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. నంద్యాల సిటింగ్ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి అక్కడి నుంచే టిడిపి తరపున పోటీ చేస్తారు.
వీరే కాకుండా విశాఖ జిల్లాలో మరో ఇద్దరు ముగ్గురు సిటింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు గుడ్బై చెప్పి టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. కిరణ్ కేబినెట్లోని మరో ఇద్దరు మంత్రులు కూడా టిడిపి నాయకత్వంతో సంప్రదింపుల్లో ఉన్నారని, కొద్ది రోజుల్లో వారు తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శ్రీధర కృష్ణా రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు త్వరలో టిడిపిలో చేరనున్నారు. తూర్పు గోదావరి నుండి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, పశ్చిమ గోదావరి నుండి ఈలి నాని, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణలు టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి బిజెపిలోకి వచ్చిన రఘురా కృష్ణంరాజు కూడా టిడిపిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.