ఎయిర్ హోస్టెస్లకి వేధింపు, అరెస్ట్: నకిలీ వీసాలతో గర్ల్స్
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్లో నలుగురు ఇండిగో ఎయిర్ లైన్స్ హోస్టెస్లను వేధించిన ముగ్గురు యువకులను బుధవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు రిమాండుకు తరలించారు. నగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన సాలెహ్ బజాబర్, సలాంబిన్ హసన్, సయ్యద్ సమి అనే ముగ్గురు యువకులు ఈ నెల 18వ తేదీన రాత్రి హోటల్లో భోజనం చేస్తున్నారు.
ఇంతలో అటుగా వెళ్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్ హోస్టెస్లను చూచి వేధించారు. ఈ మేరకు ఇండిగో ఎయిర్ లైన్స్ అధికార వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
సీఆర్పీఎఫ్ జవాన్ల ఫైరింగ్ శిక్షణలో అపశృతి
మెదక్ జిల్లాలోని పుల్కల్ మండలం శివంపేట దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్ల ఫైరింగ్ శిక్షణలో అపశృతి చోటు చేసుకుంది. శిక్షణలో భాగంగా బుల్లెట్ మిస్ఫైర్ అయి పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆమెను సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి బుల్లెట్ను తొలగించి అనంతరం మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి తరలించారు.
యువకుడిని కృష్ణానదిలోకి తోసేసిన దుండగులు
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం సీతానగర్ వద్ద గురువారం ఉదయం ఓ యువకుడిని ఇద్దరు దుండగులు కృష్ణా నదిలోకి తోసివేశారు. ఇనుప చువ్వలపై యువకుడు పడిపోవడంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది. దీన్ని గుర్తించిన స్థానికులు దుండగుల పట్టుకునేందుకు వెంటపడటంతో కృష్ణానదిలోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్రం గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు.
నకిలీ వీసాలతో పట్టుబడ్డ గర్ల్స్
శంషాబాద్ విమానాశ్రయంలో నలుగురు యువతులు నకిలీ వీసాలతో పట్టుబడ్డారు. నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించిన నలుగురు విశాఖ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు నకిలీ వీసాలు ఇచ్చిన ఏజెంటును కూడా పోలీసులు అరెస్టు చేశారు.